మన రాజకీయ నాయకుల మాట తీరు, వ్యవహార శైలిలో వైరుద్యం ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడుతోంది.
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, అనిత వంగలపూడి తదితర మంత్రులు పదవీ, అధికారం చేతుల్లోనే ఉన్నప్పటికీ చాలా నిరాడంబరంగా ఉంటున్నారు. వారిలో ఏ ఒక్కరూ ఎన్నడూ అహంభావంతో వ్యవహరించరు.
అందరూ మునుపటి కంటే ప్రజలతో మరింత ఎక్కువ స్నేహంగా, వినయంగా, హుందాగా వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. మీడియా, సోషల్ మీడియాలో కూడా వారి తీరు చాలా హుందాగానే ఉంటోంది.
ఇదివరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఎం జగన్ కాకుండా, అరడజను మంది డెప్యూటీ సిఎంలు, మంత్రులు ఉండేవారు. కానీ ఎవరూ ఎవరికీ అందుబాటులో ఉండేవారు కారు. వారిలో కొంతమంది రసిక రాజులు కాగా, మరికొందరు నోరు విప్పితే బూతు పురాణాల స్పెషలిస్టులు ఉన్నారు.
నేటికీ వైసీపీ అధినేత జగన్తో సహా ఆ పార్టీ నేతల తీరు ఏ మాత్రం మారకపోగా ‘రప్పారప్పా’తో మరింత పదునెక్కింది. వారు పెట్టుబడిదారులనే కాదు… అధికారులను, సిఎం, డెప్యూటీ సిఎం, మంత్రులను కూడా బెదిరించే స్థాయికి ఎదిగిపోయారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కాస్త దురుసుగా వ్యవహరిస్తున్నప్పటికీ, సిఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ప్రజలతో సఖ్యతగానే ఉంటున్నారు. హుందాగానే వ్యవహరిస్తున్నారు.
ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతల్లాగే, అక్కడ కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలో కొందరు చాలా అహంభావంతో వ్యవహరిస్తుండటం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ తాము ఎన్నడూ అహంభావంతో విర్రవీగలేదని కేసీఆర్ చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.
ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నవారు ప్రజలతో వినయంగా, మీడియాతో సఖ్యతగా వ్యవహరిస్తుంటే, అహంభావంతో చేజేతులా అధికారాన్ని పోగొట్టుకున్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు నేటికీ అహంభావంతో విర్రవీగుతుండటం మరో విశేషం!




