బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో… తాప్సీ, ఆండ్రియా తరియంగ్, కీర్తి కుల్హర్ లు ఇతర పాత్రల్లో నటించిన సినిమా ‘పింక్’ విమర్శకుల ప్రశంసలను సైతం ఈ సినిమా అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. పలు అంతర్జాతీయ వేదికలపైనే కాకుండా ,ఐక్యరాజ్యసమితిలో సైతం ఈ సినిమాను ప్రదర్శించారంటే ఏ స్థాయిలో సినిమాను తెరకెక్కించారనేది అర్ధం చేసుకోవచ్చు.
ఆధునిక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వారిపై చూపుతున్న వివక్ష ఆధారంగా నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీక్షించనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. చిత్ర బృందంతో కలిసి ఈ సినిమాను ప్రణబ్ చూడబోతున్నట్టు అమితాబ్ తెలపగా, తాను నటించిన సినిమాను రాష్ట్రపతి చూడనుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని హీరోయిన్ తాప్సీ చెప్పింది.



