సేవింగ్స్ ఖాతాదారులపై కొరడా ఝళిపించేందుకు ప్రైవేటు బ్యాంకులు సిద్ధమయ్యాయి. నగదు నియంత్రణలో భాగంగా లావాదేవీలపై పలు బ్యాంకులు ఆంక్షలు విధించాయి. నగదు ఉపసంహరణ, జమ… ఏదైనా సరే నాలుగింటికి మించితే తర్వాత జరిపే ఒక్కో లావాదేవీకి 150 వసూలు చేయనున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఇప్పటికే ఈ మేరకు అంతర్గత ఆదేశాలు జారీ చేశాయి. అంతేకాదు బుధవారం (మార్చి 1వ తేదీ) నుండే ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చాయి.
హోం బ్రాంచిలో నెలకు నాలుగు సార్లు ఉచిత ట్రాన్సాక్షన్స్ కు అనుమతించిన ఐసీఐసీఐ, ఆపై జరిపే ప్రతి లావాదేవీకి ప్రతి వెయ్యి రూపాయలకు 5 చొప్పున కనిష్టంగా 150 వసూలు చేయనుంది. థర్డ్ పార్టీ లావాదేవీలపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు రోజుకు 25 వేల పరిమితిని విధించింది. యాక్సిస్ బ్యాంకు మాత్రం నెలకు ఐదు లావాదేవీలు లేదంటే 10 లక్షల వరకు ఉచితంగా లావాదేవీలకు అనుమతించి, ఆ తర్వాత జరిపే ట్రాన్సాక్షన్స్ కు చార్జీలు విధించనుంది. తాజా నిబంధనలు గమనించకుండా లావాదేవీలు జరిపారో, అకౌంట్స్ లో డబ్బులు మాయం కావడం ఖాయం.



