
ఎఫ్-1 రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ని ఏ-1గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. ఆయనని అరెస్ట్ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పేశారు. కనుక నేడో రేపో ఆయనని విచారణకి పిలిచి అరెస్ట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
జైలుకి వెళ్ళేందుకు భయపడేదేలే.. అని చెప్పిన కేటీఆర్, ఏసీబీ కేసు వేసిందని సమాచారం అందగానే, ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ (క్వాష్) పిటిషన్ వేశారు. తనపై నమోదు చేసిన ఈ కేసుని కొట్టివేయాలని కేటీఆర్ కోరారు.
Also Read – నందిగం సురేష్ బయట కంటే లోపలే హ్యాపీ?
ఈరోజు భోజన విరామం తర్వాత హైకోర్టు కేటీఆర్ పిటిషన్పై విచారణ జరుపనుంది. అయితే ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏసీబీ కేటీఆర్ తదితరులపై కేసు నమోదు చేసినందున దానిపై విచారణ జరుపకుండా హైకోర్టు కేసు కొట్టేయదు కానీ కేటీఆర్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
కేటీఆర్పై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. కానీ హైకోర్టు ధర్మాసనం కేటీఆర్కి మినహాయింపు ఈయవచ్చు. అల్లు అర్జున్కి కూడా అలాగే మినహాయింపు ఇచ్చి మద్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Also Read – ఇంకెంతమంది జ్యోతి మల్హోత్రాలున్నారో.?
ఇక నేడో రేపో కేటీఆర్ అరెస్టుకి రంగం సిద్దమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ రెచ్చిపోకుండా ముందుగానే కట్టడి చేసేందుకు మరో వ్యూహం అమలుచేస్తుండటం విశేషం.
తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈరోజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “ఏసీబీ అధికారులు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు పెద్ద కుట్ర చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది.
Also Read – ఉచితం సముచితం కాదు కానీ తప్పదుగా!
ఎక్కడికక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు, ఆర్టీసీ బస్సులపై దాడులు చేస్తూ రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది.
కేటీఆర్కి ఆత్మ వంటి ఆయన సన్నిహితుడు తేలుకుంట శ్రీధర్ రాష్ట్రంలో అల్లర్లు, విధ్వంసం సృష్టించాలని బిఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అల్లర్ల కోసం ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున మొత్తం వంద కోట్లు ఖర్చు పెట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ సిద్దమైనట్లు ప్రభుత్వానికి సమాచారం ఉంది. కనుక పోలీసులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు అందరూ అప్రమత్తం ఉండాలి,” అని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
కనుక కేటీఆర్ అరెస్టుతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.