చివరి నిమిషం వరకు పొత్తుల పై నాన్చుడు ధోరణితో ముందుకెళ్లడంతో తెలంగాణలో కమలం వాడిపోయింది. అయినా బీజేపీ అధిష్ఠానములో చలనము రాకపోవడం కాస్త విడ్డురంగానే ఉంది. ఏపీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేనలు ఎవరి ఎత్తులు వారు వేసుకుంటూ ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధమయ్యారు.
కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇటు పక్క పొత్తుల పై ఒక క్లారిటీకి రాలేకపోతుంది. అటు పక్క రాజకీయ అడుగులు ముందుకు వేయలేకపోతుంది. ఒంటరిగా వెళితే ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటో గత ఎన్నికలలో రుచి చూసిన బీజేపీ అధిస్టానం తిరిగి ఆ నిర్ణయం వైపు మొగ్గు చూపుతారని ఆశించలేము. అలా అని వేచి చూసే ధోరణిలో అనధికార మిత్రులను వదులుకోలేక అధికార పొత్తులో ఉన్న పార్టీకు చేరువ కాలేక తమ నిర్ణయాన్ని నాన్చుడు ధోరణిలో ముందుకు తీసుకు వెళుతున్నారు.
నాదెండ్ల మనోహర్ తో భేటీ అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి మీడియాతో మాట్లాడారు. తమకు ఇప్పటికి జనసేన మిత్ర పక్షమే అంటూ, నాదెండ్లతో మర్యాదపూర్వక సమావేశమే జరిగిందన్నారు. పొత్తుల పై తమ అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియచేయడం జరుగుతుందని, ఆపై అంతిమ నిర్ణయం అధిష్టానానిదే అంటూ కేంద్ర పెద్దల మీదే భారం వేశారు పురందరేశ్వరి. అలాగే వైస్ షర్మిల రాజకీయ నిర్ణయాల మీద కూడా స్పందిస్తూ ఎవరు ఏ పార్టీలో చేరితే మాకెందుకన్నారు.




