ఆనాడు రావణుడు తప్పు దారిలో పయనిస్తున్నప్పుడు విభీషణుడు నచ్చజెప్పబోయి అవమానం పాలై శ్రీరాముడు శరణు కోరి రావణవధకు తోడ్పడ్డాడు. అందుకే ఇంటి గుట్టు లంకకు చేటు అనే సామెత పుట్టుకొచ్చింది.
అలాగే ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా జగన్మోహన్ రెడ్డికి హితవు చెప్పబోయి చేదు అనుభవాలు ఎదుర్కొని పార్టీని, రాష్ట్రాన్ని వీడి ఏపీకి దూరంగా ఢిల్లీలో ఉంటూ జగన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఆయన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి తరలించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. గత పదేళ్లుగా 11 కేసుల విచారణ నత్తనడకన సాగుతున్నాయని, ఆ కేసులు ఇప్పటి వరకు 3,041 సార్లు వాయిదాలు పడ్డాయని తన పిటిషన్లో పేర్కొన్నారు.
నిందితుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున సీబీఐ కూడా ఈ కేసుల విచారణపై ధైర్యంగా ముందుకు సాగలేకపోతున్నట్లు కనబడుతోందని రఘురామ ఆరోపించారు. ఈ కేసుల విచారణ ముందుకు సాగకుండా నిందితుడు జగన్ చట్టంలో ఉండే అన్ని అవకాశాలను తెలివిగా వినియోగించుకొంటూ ఇప్పటికే 10 ఏళ్ళుపైగా లాగించేశారని, ఈలెక్కన ఈ కేసుల విచారణ ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కనుక అన్ని కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయవలసిందిగా రఘురామ తన పిటిషన్లో కోరారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రఘురామ కృష్ణరాజు పిటిషన్ను శుక్రవారం విచారణకు చేపట్టనుంది.
ఇన్నేళ్ళుగా ఈ కేసులు సాగుతున్నప్పటికీ, ఏపీలో ప్రతిపక్షాలు వాటిని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుండేవి తప్ప ఏనాడూ ఇటువంటి ఆలోచన చేయలేదు. కానీ వైసీపిలో విభీషణుడు వంటి రఘురామ కృష్ణరాజే మళ్ళీ దీనికి పూనుకోవడం విశేషం. ఆయన వేసిన ఈ పిటిషన్ అణుబాంబు వంటిదే అని చెప్పొచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆయన వాదనలతో ఏకీభవించి ఈ కేసులన్నిటినీ వేరే రాష్ట్రానికి బదిలీ చేసి, విచారణ వేగవంతం చేసిన్నట్లయితే, జగన్మోహన్ రెడ్డితో సహా నిందితులందరికీ ఇబ్బంది తప్పదు. ఆనాడు విభీషణుడు శ్రీరాముడికి తోడ్పడి లంకలో రాక్షసరాజ్యాన్ని అంతమొందించగలిగాడు. మరి ఈనాడు ఈ ఆధునిక విభీషణుడు రఘురామరాజు ఆంధ్రప్రదేశ్లో వైసీపి పాలనను అంతమొందించేందుకు చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో?




