వైసీపిని, జగన్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజును ఒక్క రాజద్రోహం కేసు మినహా మిగిలిన కేసులలో విచారించుకొనేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ప్రభుత్వం గుపెట్లో చిక్కబోతున్నట్లే ఉన్నారు.
ఆయన రాష్ట్రంలో రెండువర్గాల ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారంటూ ఆయనపై ఏపీ సీఐడీ పోలీసులు ఐపిసీ సెక్షన్స్ కింద 124ఏ, 153ఏ, 505, 120బి కేసు నమోదు చేశారు. దానిలో 124ఏ (రాజద్రోహం) నుంచి సుప్రీంకోర్టు ఆయనకు విముక్తి కల్పించినందున, మిగిలిన కేసులలో విచారణ జరుపుకోవచ్చని హైకోర్టు నిన్న తీర్పు చెప్పింది.
అయితే హైదరాబాద్ దిల్కుశ గెస్ట్ హౌసులో న్యాయవాది ఎదుట ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆయనను విచారించాలని షరతు విధించింది. ఈవిషయంలో పోలీసులు కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకొంటామని హైకోర్టు ముందే హెచ్చరించింది.
ఇంతకాలం ఎంపీ రఘురామ వైసీపీలోనే ఉంటూ ఢిల్లీలో కూర్చొని సిఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, కోర్టు కేసులు వేస్తూ ముప్పతిప్పలు పెడుతున్నారు. కానీ జగన్ ప్రభుత్వం ఆయనను ఏమీ చేయలేకపోతోంది.
హైకోర్టు ఇప్పుడు ఆయనను విచారించేందుకు అనుమతించడం జగన్ ప్రభుత్వానికి చాలా ఆనందం కలిగించే విషయమే. ఏపీ సీఐడీ పోలీసులు ఆయనపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఉండటంతో వాటితో వారు ఏదోవిదంగా ఆయనను మళ్ళీ కేసులో బిగించే ప్రయత్నం చేయడం ఖాయం.
అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలనే హైకోర్టు ఉత్తర్వులే ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. కనుక ఈ విచారణలో ఆయన న్యాయవాది చాలా కీలకం కాబోతున్నారు. ఒకవేళ సీఐడీ పోలీసులు తమ ప్రయత్నంలో సఫలమైతే రఘురామకృష్ణ రాజుకి మళ్ళీ కష్టకాలం మొదలైపోతుంది. కనుక న్యాయవాదే రఘురామకృష్ణ రాజును కాపాడుకోవలసి ఉంటుంది.



