వైసీపీలో విభీషణుడు వంటివారు ఎంపీ రఘురామకృష్ణరాజు. కానీ ఆయన అరికాళ్ళు వాచిపోయేలా కొట్టడంతో ఏపీలో అడుగుపెట్టేందుకు భయపడుతూ ఢిల్లీలో కూర్చొని ‘వైసీపీ జాతకాలు’ చదివి చెపుతుంటారు. వచ్చే లోక్సభ ఎన్నికలలో ఏపీలో వైసీపీ పరిస్థితి ఏమిటనే దానిపై ఆయన చక్కటి విశ్లేషణ చేశారు.
ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మొహం చూసి 2019 ఎన్నికలలో వైసీపీకి ఓట్లు వేశారు. ఒకవేళ వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినట్లయితే మళ్ళీ వారందరూ కాంగ్రెస్ వైపు వెళ్లిపోతారు. కనుక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎటువైపు ఉంటుందనేది రాబోయే ఎన్నికల ఫలితాలను నిర్దేశించవచ్చు.
అలాగే ఏపీలో సుమారు 6 శాతం మైనార్టీ ఓటు బ్యాంక్ ఉంది. వారందరూ 2019లో మా అధినేత జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి మా పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఈ నాలుగేళ్ళలో తాము మోసపోయామని గ్రహించడంతో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఒకవేళ రాబోయే ఎన్నికలలోగా ఏపీ కాంగ్రెస్ లేచి నిలబడగలిగితే మైనార్టీలు దాని హస్తం అందుకోవడానికి సిద్దంగా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కోలుకోలేకపోతే వారందరూ టిడిపి, జనసేనల వైపు మొగ్గుచూపుతారు.
వైసీపీకి అండగా నిలబడిన ఎస్సీ, ఎస్టీలు కూడా ప్రత్యామ్నాయ పార్టీలవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి కడప, రాజంపేటలోనే వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగులబోతోంది.
తాజా సర్వే ప్రకారం ఈసారి లోక్సభ ఎన్నికలలో వైసీపీ 4-5 సీట్లు, శాసనసభ ఎన్నికలలో సుమారు 40 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది,” అని అన్నారు.
ఆయన చెప్పిన సర్వేలు వాటి నివేదికలు కాకి లెక్కలని పక్కన పెట్టేసినా కాంగ్రెస్ ఓటు బ్యాంక్, ముస్లిం మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు వైసీపీని వద్దనుకొంటే ఆ పార్టీకి ఓటమి తప్పదనేది సహేతుకంగా ఉంది.
ఒకవేళ వైఎస్ షర్మిల ధైర్యం చేసి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే, అప్పుడు ఆమెకీ ఓ అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలనుకొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రాజకీయ ప్రయోగం మొదలవుతుంది. కానీ వైఎస్ షర్మిల రాకపోతే ఆమె లేని కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోరు. కనుక అప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు టిడిపి, జనసేనలవైపు మొగ్గుచూపితే వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదు. ఈ విషయం వైసీపీకి కూడా బాగా తెలుసు. కనుక వారి ఓటు బ్యాంక్ చేజారిపోకుండా కాపాడుకొనేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.



