అలనాడు మహాభారతంలో దుర్యోధనుడి పక్కనే ఉంటూ అతని పతనానికి కారకుడైన వ్యక్తి శకుని. అలాగే కర్ణుడికి రధ సారధ్యం చేస్తూ అతని పతనానికి కారకుడైన వ్యక్తి శల్యుడు. భీష్ముడితో పోరాడనప్పటికీ, రధంపై అర్జునుడి ముందు నిలబడి ఓడించిన వ్యక్తి శిఖండి. ద్రోణాచార్యుల మరణానికి కారణమైనది అశ్వతామ అనే పేరుగల ఏనుగు. సూర్యుడికే సుదర్శనచక్రం అడ్డంవేసి అర్జునుడి చేత జయద్రద్రుడిని చంపించిన వ్యక్తి శ్రీకృష్ణుడు. గడ్డిపోచను చీల్చి చూపి భీముడిచేత దుర్యోధనుడిని మట్టుబెట్టించిన ఘనుడు శ్రీకృష్ణుడే.
ఈవిదంగా మహాభారతంలో కౌరవులలో ఒక్కొక్కరి పతనం లేదా మరణం వెనుక ఒక్కో వ్యక్తి కనిపిస్తున్నాడు. కానీ “ఏపీలోని కౌరవరాజ్యంలో అష్టకష్టాలు అనుభవిస్తున్న ప్రజలను కాపాడేందుకు ఏ శ్రీకృష్ణుడు లేడు… రాడు… ఒకవేళ వచ్చినా ఏమీ చేయలేదు,” అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు.
స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేస్తున్న అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ కార్యక్రమానికి రఘురామకృష్ణ రాజు కూడా రాబోతున్నారు. అయితే తాను ఏపీలో అడుగుపెడితే పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని లేదా వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తారని భావిస్తున్న ఆయన తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో తెలుగు మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యోగుల ఖాతాలకు ప్రభుత్వమే కన్నం వేయడం చాలా విడ్డూరంగా ఉంది. రూ.800 కోట్లు వారి జీపీఎఫ్ ఖాతాలలో నుంచి మాయం అయిపోతే, జగన్ ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి సరైన సమాధానం చెప్పకపోగా పొంతనలేని కాకమ్మ కధలు చెపుతుండటం విస్మయం కలిగిస్తుంది. ప్రభుత్వమే ప్రజలను దోచుకొంటుంటే, ఈ కౌరవుల బారి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు ఏ శ్రీకృష్ణుడే లేడు… రాడు. ఒకవేళ వచ్చినా ఏమీ చేయలేడు కూడా. ఇది చాలా దురదృష్టకరం. మా (వైసీపీ) ప్రభుత్వం ఒక్క నెలలో రూ.8,000 కోట్లు అప్పు చేసి మొత్తం ఖర్చుపెట్టేసింది. ఇక ఎక్కడా మా (వైసీపీ) ప్రభుత్వానికి అప్పు పుట్టే అవకాశమే లేదు. బహుశః అందుకే ఇంత నీచానికి దిగజారిందేమో?” అని రఘురామకృష్ణ రాజు అన్నారు.



