తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో అన్నా చెల్లెళ్ళు అంటే జగన్-షర్మిల, కేటీఆర్-కవిత ముందుగా గుర్తొస్తారు. కానీ ఆస్తుల కోసం జగన్-షర్మిల దూరం కాగా, రాజకీయాల కారణంగా కేటీఆర్-కవిత దూరమయ్యారు.
వీరిలో కేటీఆర్-కవిత ఒకే కుటుంబం, ఒకే పార్టీ కనుక ఎప్పటికైనా మళ్ళీ కలిసే అవకాశం ఉండవచ్చు. కానీ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినందున, ఆమెకు, జగనన్నకు ఆస్తుల పంచాయితీ ముగిసే అవకాశం లేనందున వారెప్పటికీ మళ్ళీ కలిసే అవకాశం ఉండకపోవచ్చు.
కనుక రాజకీయాలలో ఉన్న అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండటం కష్టమని వీరితో స్పష్టమవుతోంది.
కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి అన్నా చెల్లెళ్ళే చాలా సఖ్యతగా ఉంటున్నారు. వారే కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా.
ప్రస్తుతం వారి పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు. కొన్ని రాష్ట్రాలలో ఉన్నా వాటి కోసం వారు పోటీ పడటం లేదు. ఆమె చాలా కాలం క్రితమే రాబర్ట్ వాద్రాని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయారు. కనుక అన్నా చెల్లెళ్ళ మద్య పదవుల గొడవలు, ఆస్తుల పంచాయితీలు ఏమీ లేవు.
కనుక రాహుల్-ప్రియాంకా ఇద్దరూ కలిసి మెలిసి బీహార్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం బీహార్లో ‘ఓటర్ అధికార యాత్ర’ చేస్తున్నారు. దానిలో భాగంగా మంగళవారం ముజఫరాపూర్లో బైక్ ర్యాలీలో పాల్గొన్నప్పుడు రాహుల్ గాంధీ చెల్లి ప్రియాంక వాద్రాని తన బైక్పై కూర్చోబెట్టుకొని ముందుకు సాగుతుంటే ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అన్నా చెల్లెళ్ళు కలిసి ఇంత సఖ్యతగా రాజకీయాలలో పాల్గొనడం ద్వారా బీహార్ ప్రజలను ఆక్కట్టుకోగలుగుతున్నారు కూడా.
ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెప్పుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిచి, రాహుల్ గాంధీ ప్రధాని అయితే అప్పుడు కూడా ఈ అన్నా చెల్లెళ్ళ అనుబందం ఇలాగే ఉంటుందా లేదో?
కాంగ్రెస్ పార్టీ గెలిచినా గెలవకపోయినా, రాహుల్ గాంధీ ప్రధాని అయినా కాకపోయినా ఈ అన్నా చెల్లెళ్ళ అనుబందం ఇలాగే ఉండాలని కోరుకుందాము.





