ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మద్య బీహార్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీ తప్పో ఒప్పో ఓ రాజకీయ వ్యూహం అమలు చేస్తోంది. అదే… కేంద్రం, ఈసీ కలిసి ‘ఓట్లు దొంగతనం’ చేశాయనే వాదన. బీహార్లో లక్షల మంది ఓటర్లని ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో తొలగించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఇదివరకు కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఇలాగే చేసిందని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ వాదిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నందున రాహుల్ ‘సర్’ ఈ పేరుతో బీహార్ చుట్టేస్తున్నారు. బీహార్లో ఓట్లు దొంగతనం అయ్యాయంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.
దీనిలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, బీహార్ ప్రజలపై రాహుల్ గాంధీ ప్రచార ప్రభావం తప్పకుండా పడుతుంది. అది ఎన్నికల ఫలితాలను తారుమారు చేసినా ఆశ్చర్యం లేదు.
కాంగ్రెస్ పార్టీ… దాని యువరాజు తప్పో ఒప్పో ఓ లైన్ తీసుకొని ముందుకు దూసుకుపోతున్నారు. ఎన్నికలకు ముందు రాహుల్ దూకుడుకి బీజేపి అడ్డుకట్టవేయలేకపోతే బీహార్ ఎన్డీయే చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. అది ఎన్డీయే కూటమి బలాబలాలను తారుమారు చేస్తే కేంద్రానికి కూడా చాలా ప్రమాదంగా మారవచ్చు. కనుక మోడీ, అమిత్ షాలు తప్పనిసరిగా రాహుల్ ‘సర్’కి విరుగుడు కనిపెట్టాల్సిందే.





