ఏపీలో ప్రతిష్ఠాత్మకమైన ప్రైవేట్ యూనివర్సిటీగా పేరుగాంచినది గీతం యూనివర్సిటీ. అత్యుత్తమ విద్యాప్రమాణాలు పాటిస్తుంటుంది కనుక గీతం యూనివర్సిటీకి అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నత విద్యలభ్యసిస్తుంటారు. ఆంధ్రాకు గర్వకారణమైన ఇటువంటి యూనివర్సిటీని మరో ప్రభుత్వమైతే గుర్తించి, అవార్డులతో గౌరవిస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం దాని వెంటబడి వేధిస్తూనే ఉంది.
ఇప్పటికే పోలీసులు, రెవెన్యూ అధికారులు పలుమార్లు గీతం యూనివర్సిటీపైకి దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జనవరిలోనే ఓసారి దండయాత్ర చేసి యూనివర్సిటీని ఆనుకొనున్న 14 ఎకరాలు కబ్జాకు గురయిందంటూ ఫెన్సింగ్ వేశారు. ప్రస్తుతం ఆ భూవివాదం కోర్టులో ఉండగా గురువారం రాత్రి మరోసారి గీతం యూనివర్సిటీపై దండయాత్ర మొదలుపెట్టారు.
గీతం యూనివర్సిటీకి వెళ్ళే దారులన్నీ బ్యారీకేడ్లతో మూసివేసి, భారీగా పోలీసులను మోహరించారు. ఆ రోడ్డులో వాహనాలను తనికీలు చేసి పంపిస్తున్నారు. యూనివర్సిటీలోకి విద్యార్థులను ఐడీ కార్డులు తనికీలు చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఈసారి ప్రధాన క్యాంపస్లో డెంటల్ కాలేజీ వద్ద సుమారు ఒక కిలోమీటరు మేర కబ్జాకు గురయిందని చెపుతూ కంచె వేస్తున్నారు.
ఒక ప్రతిష్ఠాత్మకమైన ఉన్నత విద్యాసంస్థ పట్ల పదేపదే ఈవిదంగా వ్యవహరిస్తుండటం ద్వారా ఆ సంస్థ ప్రతిష్ట దెబ్బ తింటుందని వేరే చెప్పక్కరలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి టిడిపికి సంబందించిన లేదా దానితో రాజకీయ సంబంధాలున్న సంస్థలన్నిటినీ ఇదేవిధంగా వేధిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. సంగం డెయిరీ, మార్గదర్శి, గీతం యూనివర్సిటీ వంటివి ఇందుకు నిదర్శనాలుగా కనిపిస్తునాయి.
గీతం యూనివర్సిటీ టిడిపికి చెందిన స్వర్గీయ ఎంవీవియస్ మూర్తి స్థాపించినది కావడమే ఈ దండయాత్రలకు అసలు కారణమని భావించవచ్చు. ఒకవేళ యూనివర్సిటీ నిజంగా భూకబ్జాలకు పాల్పడి ఉంటే దాని కోసం ఇంత హడావుడి చేయక్కరలేదు. కానీ దేశభద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నట్లు, యూనివర్సిటీలో కరుడుగట్టిన ఉగ్రవాదులు దాక్కొన్నారన్నట్లు పోలీసులు చేస్తున్న హడావుడి యూనివర్సిటీ ప్రతిష్టను మసకబార్చుతుందని చెప్పవచ్చు.
వైసీపీ ప్రభుత్వం ఈవిదంగా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది కనుకనే ఈ నాలుగేళ్ళలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలను, ఐటి కంపెనీలను, విద్యా, వ్యాపార సంస్థలను తీసుకురాలేకపోగా ఉన్నవాటిని రాష్ట్రం నుంచి పారిపోయేలా చేస్తోందని టిడిపి నేతలు వాదిస్తున్నారు. నాలుగు రాష్ట్రాలలో విస్తరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్న ప్రతిష్ఠాత్మకమైన ఓ యూనివర్సిటీకి వైసీపీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా?ఇలా వ్యవహరిస్తుంటే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఎందుకు వస్తాయి? వైసీపీ ప్రభుత్వం ఈవిదంగా వ్యవహరిస్తూ పెట్టుబదుదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సంకేతాలు పంపిస్తోందో తెలుసా? అని టిడిపి నేతల ప్రశ్నిస్తున్నారు.



