ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ విడుదలకు ఐదు రోజులకు ముందే ఆన్ లైన్లో లీకైందన్న వార్తలు చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదుపుతున్నాయి. ఈ సినిమా సెన్సార్ కు వెళ్లినప్పుడు లీక్ అయినట్టు వార్తలు రావడంతో సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహ్లానీ స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సినిమా లీక్ విషయంలో తమకు సంబంధం లేదని, పెద్ద చిత్రాలు లీక్ కావడం పట్ల ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ చిత్రాన్ని చెన్నైలో సెన్సార్ చేశారని, ముంబైలోని తమ కార్యాలయానికి సంబంధం లేదని అన్నారు.
స్టార్ హీరోల చిత్రాలు లీక్ అయితే, వసూళ్లు ఎంత వరకూ తగ్గుతాయో తాను చెప్పలేనని, చిన్న సినిమాలు అయితే మాత్రం భారీగా నష్టపోతాయని భావిస్తున్నానని అన్నారు. కాగా, ఇటీవల పలు కొత్త చిత్రాలు విడుదలకు ముందుగానే ఆన్ లైన్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘సుల్తాన్,’ దానికన్నా ముందు ‘ఉడ్తా పంజాబ్,’ ఆపై ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ చిత్రాలు నెట్టింట ప్రత్యక్షమైన విషయం తెలిసిందే.
ఇక, ‘కబాలి’ సినిమా ఆన్లైన్ పైరసీని అడ్డుకునేలా చూడాలంటూ నిర్మాత మద్రాసు హైకోర్టుకెక్కడంతో 169 కి పైగా వెబ్ సైట్లపై కోర్టు ఇప్పటికే ఆంక్షలు విధించగా, డార్క్ వెబ్ లింకులను డిలిట్ చేయాలని ‘కబాలి’ ప్రొడక్షన్ హౌస్ వర్గాలు అధికారులను కోరినట్టు తెలిసింది. ఈ మూవీని డౌన్లోడ్ చేసుకునేందుకు డార్క్ వెబ్ పై ఈ సినిమా తాలూకు లింకులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయని హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది. కానీ దీన్ని వాడాలంటే నిర్దిష్టమైన కాన్ఫిగరేషన్స్ అవసరమవుతాయని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న టాక్.



