తన విడాకులపై వస్తున్న కధనాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య స్పందిస్తూ… సదరు సమాచారం అంతా నిజమేనని పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా తాను భర్త అశ్విన్ విడివిడిగా ఉంటున్నామని, విడాకుల విషయంలో ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఇది పూర్తిగా తమ కుటుంబ వ్యవహారమని, దయచేసి దీనిపై అనవసర ఊహాగానాలు చేయవద్దంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, పెద్దది చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
తమ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న సోదరి ఐశ్వర్య భర్త ధనుష్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రాఫిక్స్ టెక్నాలజీలో నిపుణురాలైన సౌందర్య 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్కుమార్ ను వివాహం చేసుకోగా, వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. తండ్రి రజనీకాంత్ నటించిన యానిమేషన్ చిత్రం ‘కొచ్చాడియన్’తో దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేసారు.
అలాగే ‘గోవా’ చిత్రం ద్వారా నిర్మాతగానూ మారిన సౌందర్య, ధనుష్ హీరోగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో సినీ ప్రముఖుల విడాకుల వార్తలు ఎక్కువగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ కోవలోకి సౌందర్య కూడా చేరడంతో విస్తృత ప్రచారం జరిగింది. మీడియాలో ఆమె విడాకుల వార్తలు ప్రముఖంగా వస్తుండడంతో సౌందర్య స్పందించక తప్పలేదు.



