సినిమా రెండు మూడు గంటల్లో అయిపోతుంది. వెబ్ సిరీస్ కూడా కొన్ని ఎపిసోడ్స్లో పూర్తయిపోతుంటాయి. కానీ తెలుగు టీవీ సీరియల్స్లాగా అంతూ పొంతూ లేకుండా ఒకదాని తర్వాత మరొకటి చొప్పున వైసీపీకి సమస్యలు తరముతూనే ఉన్నాయి.
వాటిలో ప్రధాన ప్రతిపక్షహోదా. పీఏసీ ఛైర్మన్ పదవి ఆశించడం వంటికి కొని తెచ్చుకున్న కష్టాలు కాగా, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలు దేవుడి స్క్రిప్ట్ లో భాగంగా లైన్గా వచ్చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలని బహిష్కరించి ఆ గండం గట్టెక్కగానే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.
ఏపీలో మూడు, హర్యానా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఒక్కొక్క సీటుకి మంగళవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. డిసెంబర్ 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల గడువు, 13న ఉపసంహరణ, 20 న పోలింగ్, అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల కమీషన్ తెలిపింది.
ఏపీలో వైసీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్. కృష్ణయ్యల రాజీనామాలతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.
శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో రాజ్యసభ సభ్యులతో కేంద్రానికి మద్దతు ఇస్తూ ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకొని కోర్టు కేసులు, ఏపీలో రాజకీయ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని జగన్ అనుకున్నారు.
కానీ ఊహించని విదంగా ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేయడంతో ఆ ఆశ కూడా పోయింది. పైగా మళ్ళీ ఆ మూడు స్థానాలను గెలుచుకునేందుకు తగినంత మంది ఎమ్మెల్యేలు కూడా లేరు.
కనుక ఆ మూడు సీట్లు టీడీపీ, జనసేన, బీజేపిలకు అప్పగించేసి వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు చేతులు పిసుక్కుంటూ చూస్తూ ఉండాల్సిందే.
వరుసగా ఇన్ని కష్టాలు తరుముకొస్తున్నా ‘అవిగవిగో జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయి.. మళ్ళీ మనమే అధికారంలోకి..” అని జగన్ ధైర్యం నూరిపోస్తుండటం విశేషం. ఎదురొస్తున్న ఎన్నికలను బహిష్కరించుకుంటూ, తప్పించుకొని పారిపోతూ మళ్ళీ (జమిలి) పగటి కలలు కంటుండటం భలే అనిపిస్తుంది కదా?




