కృతజ్ఞత… సరిగ్గా ఈ పదానికి అర్ధం ఏమిటో చాటిచెప్పే విధంగా రామ్ చరణ్ తన ప్రసంగాన్ని ఇచ్చారని చెప్పవచ్చు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించిన “హ్యాపీ వెడ్డింగ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన రామ్ చరణ్, ‘తాను ఈ ఈవెంట్ కు వచ్చింది నిహారిక కోసమో, ఇంకొకరి కోసమో కాదని, నిర్మాత ఎం.ఎస్.రాజు గారి కోసమని చెప్పి’ ట్విస్ట్ ఇచ్చారు.
అయితే దీనివెనుక దాదాపుగా ఓ నలభై ఏళ్ళ క్రితం స్టోరీ ఒకటి చెప్పారు చెర్రీ. దాదాపుగా 80లలో తన తండ్రి చిరంజీవి బాగా అత్యవసరంగా ఓ అయిదు వేల రూపాయలు అవసరమైన సమయంలో… తాను సినిమా చేస్తోన్న నిర్మాతలను, ఇతరులను ఎంతగా అడిగినా డబ్బులు ఇవ్వలేకపోయారని, చివరగా ఎం.ఎస్.రాజు దగ్గరికి వెళ్లి అడగగా, ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా తన తండ్రి చేతిలో అయిదు వేల రూపాయలు చేతిలో పెట్టారని” చెప్పారు.
అప్పటికీ తన తండ్రి ఆయన ప్రొడక్షన్ లో ఎలాంటి సినిమా చేయడం లేదని, కనీసం అంగీకరించలేదని తెలిపిన చెర్రీ, ఇటీవల ఈ ఉదంతాన్ని తన తండ్రి తనకు చెప్పినట్లుగా తెలిపారు. ఆ తర్వాత ఆ డబ్బును తన తండ్రి తిరిగి ఇచ్చేసినప్పటికీ, ఆ సమయంలో ఆదుకున్న వ్యక్తిగా ఆయన ఫంక్షన్ కు రావడం, నేను హీన పక్షంగా చేసేదని ఒక హార్ట్ టచింగ్ స్టోరీ… అందరినీ కదిలించి వేసింది.
చెర్రీ చెప్పిన విధానం… ఆయన కళ్ళల్లో ఫీలింగ్స్ చూస్తే… ఖచ్చితంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని చెప్పడంలో సందేహం లేదు. దాదాపుగా 80వ దశకంలో జరిగిన సంఘటనను చిరు ఇప్పటికీ గుర్తుంచుకోవడం అనేది ఒక గొప్పతనం అయితే, దానికి కృతజ్ఞతగా చెర్రీ దీనిని బాహ్య ప్రపంచానికి చెప్పడం మరో గొప్పతనం. ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎస్.రాజు గొప్ప మనసు కూడా అందరికీ తెలిసి వచ్చింది.



