దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా, దాని ప్రమోషన్స్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల పట్ల చాలా అవమానకరంగా చూపారు. మాట్లాడారు. అంతకీ తృప్తి కలగకపోవడంతో లిఖిత పూర్వకంగా ట్వీట్స్ కూడా వేశారు.
మరో ముప్పై ఏళ్ళపాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారనే గుడ్డి నమ్మకమే ఆయన ధైర్యానికి కారణం. కానీ ప్రభుత్వాలు మారాయి. వాటితో పాటు వారి పరిస్థితులు కూడా మారాయి. నాటి పాపాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది.
రాంగోపాల్ వర్మ తన క్రైమ్ సినిమాలలో పోలీసులతో ఓ ఆట ఆడేసుకుంటుంటారు. నిజ జీవితంలో కూడా అలాగే ఓ ఆట ఆడేసుకున్నారు. గత మూడు నెలలుగా ఒంగోలు రూరల్ పోలీసులను ముప్పతిప్పలు పెట్టి చివరికి ఈరోజు విచారణకు హాజరయ్యారు.
ఆయన పోలీస్ స్టేషన్కి బయలుదేరే ముందు జగన్కి అత్యంత సన్నిహితుడు, వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన బస చేసిన హోటల్కి వచ్చి కలవడం గమనిస్తే రాంగోపాల్ వర్మకి, వైసీపీతో ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు.
మూడు నెలలుగా కుంటి సాకులు చెపుతూ విచారణకు రాకుండా తప్పించుకున్న రాంగోపాల్ వర్మ ఇవాళ్ళైనా వచ్చి ఉండేవారు కారు. కానీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ పోలీసుల విచారణకు సహకరించాలనే షరతు విధించింది. కనుక ఇవాళ్ళ ఆయన విచారణకు హాజరుకాకపోయి ఉంటే పోలీసులు కోర్టు ద్వారా ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయించేవారు. అందుకే వచ్చారు.
విచారణకు ఎందుకు హాజరు కాలేదంటే సినిమా షూటింగులతో బిజీగా ఉన్నానని ఆయన చెప్పుకున్నప్పటికీ, విచారణ పేరుతో తనని కొడతారనే ఓసారి ఆయనే నోరు జారి తన భయాన్ని బయటపెట్టేసుకున్నారు. అంటే తను చేసిన తప్పులకు ఆ స్థాయిలో పోలీస్ ట్రీట్మెంట్ జరుగుతుందని రాంగోపాల్ వర్మ కూడా భావిస్తున్నారన్న మాట!
కనుక ఈరోజు ఆయన ‘దెబ్బలు పడతాయి రాజా.. దెబ దెబ్బలు పడతాయి..’ అని పాడుకుంటూ బిక్కుబిక్కుమని బయలుదేరుతుంటే చెవిరెడ్డి వచ్చి ధైర్యం చెప్పారేమో?




