తమిళనాడులోని నుంగంబక్కం రైల్వే స్టేషన్ లో జూన్ 24న ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని అత్యంత దారుణంగా నరికి చంపిన హంతకుడు రామ్ కుమార్ న్యాయస్థానంలో హాజరు పరిచిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు మాట మార్చాడు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రామదాస్ చెన్నై ప్రభుత్వాసుపత్రిలో వాంగ్మూలం నమోదు చేసుకునే సమయంలో తాను అమాయకుడిని, దళిత, పేద కుటుంబానికి చెందిన వాడిని కావడంతో పోలీసులు ఈ హత్య కేసులో తనను ఇరికించారని పేర్కొని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
పది రోజులపాటు హంతకుడు దొరకకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్, సిమ్ క్లోనింగ్ ఆధారంగా రామ్ కుమార్ ను హంతకుడిగా నిర్థారించి, అతని ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అనంతరం పోలీసుల విచారణలో తన ప్రేమను అంగీకరించకపోవడంతో పాటు తనను ‘కొండముచ్చు’ అని అవమానించిందని, అందుకే స్వాతిని హత్య చేశానని అంగీకరించిన సంగతి తెలిసిందే.
దీంతో కేసులో చిక్కుముడి వీడిపోయిందని భావించిన పోలీసులు, తాజా ట్విస్టుతో కేసు మళ్లీ మొదటికొచ్చిందని తలలు పట్టుకున్నారు. అయితే పోలీస్ విచారణలో సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ద్వారా స్వాతి తనకు పరిచయం అయిందని, తన కోసం సూర్య ప్రకాశ్ మధ్యవర్తిగా ఉన్నాడని నిందితుడు పోలీసులకు చెప్పాడు. కానీ, పోలీస్ విచారణలో రామ్ కుమార్ ఫ్రెండ్స్ లిస్ట్ లో సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి లేడు. అసలు ఇంతకీ ఆ సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ఎవరు? అతడు అసలు ఉన్నాడా లేడా?
ఇదిలా ఉంటే, మరోవైపు రామ్ కుమార్ తో పాటు రూమ్ మేట్ గా ఉన్న ఓ సంస్థ సెక్యూరిటీ గార్డు నటేశాన్ కూడా కనిపించకుండా పోయాడు. ఇక, హత్యకు వారం క్రితం ఓ వ్యక్తి స్వాతిని రైల్వేస్టేషన్లో చెంపదెబ్బలు కొట్టాడంటోన్న విషయంలోనూ పోలీసులకు స్పష్టత రావాల్సి ఉంది. అయితే రామ్ కుమార్ చెప్తున్నవి వాస్తవాలేనా? లేక కేసు నుండి తప్పించుకునేందుకు కట్టుకధలు అల్లుతున్నాడా? అన్న విషయం కూడా విచారణలో తేలాల్సి ఉంది. పోలీసుల ముందు ఒప్పుకుని మేజిస్ట్రేట్ ముందు మాట మార్చడం వెనుక వ్యూహం ఏమిటన్నది కూడా పోలీసులే నిర్ధారించాల్సి ఉంది. చూడబోతుంటే తేలిపోయిందనుకున్న స్వాతి హత్య కేసు ఓ ‘మిస్టరీ’గా మారుతున్నట్లు కనపడుతోంది.



