ఊహించిన్నట్లే శ్రీకాకుళం నుంచి వరుసగా మూడుసార్లు టిడిపి ఎంపీగా గెలిచిన కింజారపు రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి పదవి ఖరారు అయ్యింది. ఆయనతో పాటు గుంటూరు నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయమంత్రి పదవి ఖరారు అయ్యింది. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ తర్వాత వారిరువురూ కూడా ప్రమాణస్వీకారాలు చేయనున్నారు.
దివంగత కేంద్రమంత్రి కింజారపు ఎర్రన్నాయుడి కుమారుడైన రామ్మోహన్ నాయుడు 2019లో వైసీపి ప్రభంజనంలో కూడా ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ వంటి సీనియర్ ఎంపీలు కునుకు తీస్తుంటారు. కానీ రామ్మోహన్ నాయుడు ఆంధ్రాకు సంబందించిన సమస్యల గురించి మాట్లాడుతూ ప్రజల గొంతు పార్లమెంట్లో వినిపించేవారు.
ఈ క్రమంలో వైసీపి ఎంపీ మిధున్ రెడ్డి తదితరులను రామ్మోహన్ నాయుడు ధైర్యంగా ఎదుర్కొంటూ పార్లమెంట్లో జగన్ ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను వినిపించారు. అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగి సాధికారికంగా మాట్లాడగలిగే ఎంపీలలో రామ్మోహన్ నాయుడు కూడా ఒకరు కనుక ప్రధాని నరేంద్రమోడీ దృష్టిని ఆకర్షించారు. కేంద్రమంత్రి పదవి పొందబోతున్నారు.
పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికవుతూనే కేంద్ర సహాయ మంత్రి పదవి అందుకోబోతున్నారు. అందుకు బలమైన కారణమే ఉంది. ఆయన అమెరికాలో అత్యుత్తమ వైద్యులలో ఒకరుగా మంచి పేరు సంపాదించుకున్నారు.
ఆయన స్థాపించిన ‘యూ వరల్డ్’ మెడికల్ కోచింగ్ సంస్థ అమెరికాలో గొప్ప సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఎన్నికల సమయంలో కూటమి విజయానికి అయన సర్వశక్తులు ధారపోసి చాలా కృషి చేశారు. కనుక అమెరికాతో సహా పలుదేశాలలో మంచి పలుకుబడి, పరిచాయలు ఉన్న పెమ్మసానికి కేంద్ర మంత్రి పదవి వస్తే ఆయన ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించి తెస్తారని చంద్రబాబు నాయుడు భావించి ఆయనకు ఈ అవకాశం కల్పించారు.
రాబోయే రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు టిడిపికి మరో రెండు కేంద్రమంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ ఎంపీలలో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా కేంద్రమంత్రి పదవి లభించవచ్చని సమాచారం.




