‘ఉన్నది ఉన్నట్లు ముఖానే కుండబద్దలు కొట్టేయడం’ ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ నైజం అన్న విషయం తెలిసిందే. అలాంటి వ్యాఖ్యలతోనే ఇండస్ట్రీలో చాలామందిని దూరం చేసుకున్నాడు అన్న టాక్ కూడా ఉంది. రాజకీయాలలో కూడా అందుకే నెగ్గుకు రాలేకపోయారనేది అసలు విషయం. అయితే ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, కమెడియన్ క్యారెక్టర్లు చేస్తున్న పోసాని, మరో పక్కన స్మాల్ స్క్రీన్ పైన జీవితాలను చక్కదిద్దే రియాలిటీ షో కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ షోలపై ఇప్పటికే పలు రకాల అభిప్రాయాలు నెలకొనగా, దానిని తాజాగా పోసాని ధృవీకరించారు. ఈ షో కోసం తనను సంప్రదించడానికి వచ్చిన సమయంలో… ఎవరు లేనపుడు ఆర్టిఫిషియల్ ఆర్టిస్టులు కూడా ఉంటారని తనకు ముందే చెప్పారని, సదరు షోల భాగోతం బయటపెట్టారు. అలాగే పక్క నుండి నా మొగుడ్ని కొట్టండి, తిట్టండి అంటూ అరిచేవాళ్ళు ఉంటారని, ఇలాంటివన్నీ ఉంటాయని స్వయంగా పోసాని చెప్పడంతో సదరు షోలను వేలంవెర్రిగా చూస్తున్న జనాలు అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది.
అయితే ఇలాంటి షోలలో వచ్చిన కుటుంబాలను తాను వ్యక్తిగతంగా ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, గత వారమే ఇలాంటి ఓ ఘటన జరిగిందని దాని గురించి చెప్పుకొచ్చారు. పెళ్ళయిన వ్యక్తి పనిమనిషితో సంబంధం పెట్టుకుంటే, వాడ్ని పిలిపించి అడిగితే, వాళ్ళ భార్య ఇక ఆయనతో ఉండను అంటే… ఆ ఇద్దరి పిల్లలకు తాను చదువు చెప్పిస్తానని చెప్పి, మరుసటి రోజే 50 వేల రూపాయలు ఇచ్చానని, అవి ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ ఫోన్ చేయమని చెప్పానని పోసాని వివరించారు.



