వైసీపీ నేతల రాజకీయ విమర్శలు నానాటికి రాజకీయాల పరిధిని దాటి కుటుంబాల మధ్య సంబంధాలను ప్రశ్నించే స్థాయికి వచ్చేస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్ కోసం తన కులాన్ని కూడా కించపర్చడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించని పేర్ని నాని ప్రత్యర్థుల మీద చేసే రాజకీయ విమర్శలు ఎప్పుడు జగన్ కుటుంబం దగ్గరకు వచ్చే ఆగుతాయి.
పేర్ని నాని ఒక్కడే కాదు వైసీపీ నేతలు చాలామంది ఈ కోవలోకే వస్తారు. మరి తానూ ప్రత్యర్థుల మీద ఇటువంటి విమర్శలు చేస్తేనే దానికి ఉదాహరణగా జగన్ కుటుంబ సమస్యలు ప్రజలలో చర్చకు వస్తాయి అని భావిస్తారో ఏమో కానీ ఎక్కువగా ఇదే తరహా విమర్శలకు వైసీపీ నేతలు మొగ్గుచూపుతారు. పవన్ ను కించపరచాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తల్లి ఒక రెల్లి కులస్తురాలు అంటూ అప్పట్లో ఒక వైసీపీ నేత వ్యాఖ్యానించిన ఉదంతంలో జగన్ కుటుంబ పునాదులను తవ్వి తెచ్చారు ఆ పార్టీ రెబల్ ఎంపీ RRR .
అలాగే పొద్దున్న లేస్తే పవన్ మూడు పెళ్ళిళ్ళు అంటూ నోరుపారుసుకునే జగన్ నుండి ఆ పార్టీ క్రింది స్థాయి నేతల విమర్శల ఫలితమే బయటపడిన జగన్ మంగమ్మ గారి మనవడు స్టోరీ.పవన్ ఇంట్లో ఆడవారిపై విమర్శలు చేసి చేసి బోర్ కొట్టిందో ఏమో కానీ ఇక చంద్రబాబు కుటుంబం పై పడ్డారు వైసీపీ నేతలు. తమకు ప్రత్యర్థి అని భావిస్తే సొంత బాబాయ్ కూతురు, సోదరి పైన కనికరం చూపించే ప్రశ్నే లేదు అని వివేకా కూతురు సునీతా రెడ్డి విషయంలో జగన్ ఇతివరకే నిరూపించారు కూడా.
పార్టీ అధినేతే ఇలా ఉంటే ఇక పార్టీలో మిగతావారి గురించి ఆలోచించనవసరమే లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వైసీపీ మాజీ మంత్రి జగన్ దగ్గర నేను పెద్దపాలేరు అంటూ సగర్వంగా చెప్పుకునే పేర్ని నాని బాబు కుటుంబంలో ఆడవారి గురించి చేసిన రాజకీయ విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు అరెస్టుతో ప్రజాక్షేత్రానికి అందుబాటులో ఉంటున్నారు బాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి.
చంద్రబాబు అరెస్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సామజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడం,ఇటువంటి ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలబడిన వారికీ కృతఙ్ఞతలు తెలపడం,మోతమోగిద్దాం, క్రాంతితో కాంతి, నిజాయితీ సంకెళ్లు వంటి కార్యక్రమాలతో ప్రజలకు పిలుపునివ్వడం బాబుకి మద్దతుగా భువనేశ్వరి, బ్రాహ్మణీలు నిలబడడం పేర్ని నాని తప్పుబట్టారు.
గతంలో భువనేశ్వరి, బ్రాహ్మణితో గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోయిందని ఆ ఇంటి గుట్టంతా అక్కడ ఇంట్లో పనిచేసే వారికీ తెలుసునని తమ పార్టీకి అలవాటైన ఒక కట్టుకథను సృష్టించారు. అత్తమామల వేధింపులు పడలేకే బ్రాహ్మణి ఇలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఆయనకు వచ్చిన స్క్రిప్ట్ చదివారో లేక తాననుకున్న విషయాలు రాష్ట్రంలో చర్చ జరగాలని ఇలా వ్యాఖ్యానించారో లేదో కానీ జగన్ కుటుంబం పై ఇట్టే సామజిక మాధ్యమాలలో సెటైర్లు మొదలయ్యాయి.
2012 నుంచి 2019 ఎన్నికల ప్రచారం వరకు జగన్ తన సోదరి షర్మిలను, తన తల్లి విజయలక్ష్మిని తన రాజకీయ ప్రయోజనాలు పొందలేదా? ఆ తరువాత వారిని యూజ్ అండ్ త్రో మాదిరి రాష్ట్రము నుండి తరిమేసింది నిజం కాదా? ఎవరి వేధింపులు తాళలేక జగన్ చెల్లి, తల్లి తాడేపల్లి ప్యాలెస్ నుండి పక్క రాష్ట్రానికి తరలిపోయారు. షర్మిలతో గొడవ పడింది ఎవరు? విజయమ్మను తరిమేసింది ఎవరు? జగన్ ఇంటి గుట్టు ఏ పనివారి చేతిలో ఉందో? కనీసం జగన్ పాలేరు అని చెప్పుకునే పేర్నినాని సమాధానం చెప్పగలరా? అంటూ అటు టీడీపీ శ్రేణులు ఇటు సోషల్ మీడియా పేర్ని నానిని వెంటాడుతున్నాయి.
అందుకే అంటారు “గురివింద గింజ సామెత” ఒక్కసారి గుర్తుచేసుకుని వైసీపీ నేతలు పక్క పార్టీల మీద విమర్శలు చేయాలి అని. లేక పొతే అవే విమర్శలు తమ అధినేతకే బూమరాంగ్ అవుతాయి.కుటుంబంలో ఒక వ్యక్తికీ కష్టం వస్తే అండగా నిలబడడానికి ఆడ – మగ అనే తారతమ్యం ఉండదు. అది షర్మిల, విజయలక్ష్మి విషయమైనా బ్రాహ్మణి, భువనేశ్వరి విషయమైనా ఒక్కటే.
16 నెలలపాటు అవినీతి కేసులలో అరెస్టయ్యి జైలులో ఉన్న జగన్ ప్రత్యర్థులకు ఆర్థిక నేరగాడు అవుతాడు కానీ తన సతీమణి భారతి కి, ఆపార్టీ నేతలకు నిజాయితీ పరుడే అవుతాడు. ఆయనకు మద్దతుగా ఆ కుటుంబసభ్యులు నిలబడతారు. అలాగే ఆరోపణలతో జైలుకు వెళ్లిన బాబు విషయంలో కూడా ఆయన కుటుంబసభ్యులు ఆయనకు మద్దతుగా నిలబడడం తప్పేలా అవుతుంది.
నిజానిజాలు తేల్చాల్సింది న్యాయస్థానాలలో తీర్పులతో న్యాయమూర్తులు, తప్పొప్పులను తెలపాల్సింది ప్రజాస్వామ్యంలో ఓట్లతో ప్రజలు. అప్పటివరకు కుటుంబ సంబంధాలతో రాజకీయాలు చేయడం, ప్రత్యర్థి కుటుంబాల ఆడవారిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలు మానుకుంటే రాజకీయ విమర్శలు మరో మెట్టు దిగజారకుండా కాపాడిన వారవుతారు. అలాకాక ఇదే ధోరణితో వైసీపీ నేతలు ముందుకెళ్లాలని చూస్తే “మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, అలాగే మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం” అంటారు ప్రత్యర్థి పార్టీ నేతలు.






