టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే త్వరలో డీటీహెచ్ రంగంలో కూడా జియో అడుగు పెట్టబోతుందన్న వార్తలు దాదాపుగా అధికారికమైనవే. దీనికి సంబంధించిన సెటప్ బాక్స్ ల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేయడంతో, అతి త్వరలోనే డీటీహెచ్ రంగాన్ని జియో ఓ కుదుపు కుదపనుందని అర్ధమవుతోంది. అయితే జియో ప్రస్తానం ఈ రెండు మార్కెట్ లతోనే ఆగిపోవడం లేదు.
అందరి సరదా తీర్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది. టెలికాం, డీటీహెచ్ రంగాల తర్వాత జియో ల్యాప్ టాప్ లు మార్కెట్ లోకి విడుదల కానున్నాయని, ఇందులో మరింత స్పెషల్ ఏమిటంటే… ఏకంగా 4జీ సిమ్ తో పాటు ఈ ల్యాప్ టాప్ తయారవుతుందని, దీని ద్వారా డేటాతో పాటు వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చని, అందుకు సంబంధించిన సాఫ్ట్ వేర్ లను ముందుగా ల్యాప్ టాప్ లో ఉంచనున్నారని తెలుస్తోంది.
ఓ చైనా సంస్థతో దీనికి సంబంధించిన ఒప్పందాలు ఇప్పటికే కుదిరాయని, మార్కెట్ లోకి ఈ జియో ల్యాప్ టాప్ గనుక విడుదలైతే, ఆ రంగం కూడా కుదేలు కావడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఒక మోడల్ నే రూపొందిస్తుందన్న టాక్, ప్రత్యర్ధులకు కొంత ఊరటనిచ్చే అంశం. అయితే ధర విషయం ఖచ్చితంగా బయటకు రాకపోవడం గమనించదగ్గ విషయం.



