జగన్‌ రాజకీయాలు చేసుకుంటూ జమిలి కలలు కంటుంటే…

Retired CID OSD Vijay Paul Arrested

జగన్‌ ఆక్రమాస్తుల కేసులలో ఎంతో మందిని తన వెంట చంచల్‌గూడా జైలుకి తీసుకుపోయారు. నేటికీ అనేక మంది ఆ కేసులలో కోర్టుల చుట్టూ తిరుతూనే ఉన్నారు.

ADVERTISEMENT

అవన్నీ చూస్తున్నా ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీస్ అధికారులు, వైసీపీ నేతలు, వారి సోషల్ మీడియా యోధులు, చివరికి రాంగోపాల్ వర్మ, పోసానీ వంటి సినీ ప్రముఖులు జగన్‌ ప్రోత్సాహం, అండదండలు చూసుకొని పేట్రేగిపోయారు. వారందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఆనాటి మహాభారతం గుర్తురాక మానదు.

ధుర్యోధనుడు అహంభావం, రాజ్యకాంక్ష, దుర్బుద్ది గురించి అతని తల్లి తండ్రులకు, భీష్మ ద్రోణాది కురువృద్ధులకు తెలియకనే అతనికి అండగా నిలబడ్డారా?అంటే కాదనే అందరికీ తెలుసు.

వారి కళ్ళ ముందే ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగింది కూడా. అయినా ఎవరూ ధుర్యోధనుడుని అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా అతను తమని చెడు మార్గంలో నడిపిస్తున్నాడని తెలిసి ఉన్నా అనుసరించినందుకు కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ నాశనం అయిపోయారు.

చివరికి ఆ యుద్ధంలో కౌరవుల పక్షాన్న పోరాడిన శ్రీకృష్ణుడి యాదవ సైన్యం కూడా నాశనం అయిపోయింది!అంటే దుష్ట సహవాసం చేస్తే ఎంతటి వారైనా నశించిపోతారని కురుక్షేత్ర యుద్ధం నిరూపించి చూపింది.

జగన్‌ తనని తాను అర్జునుడనుకున్నా ఆయన ఖచ్చితంగా ధుర్యోధనుడు వంటివారే అని ఆయన 5 ఏళ్ళ పాలనలో జరిగిన ఆరాచకాలు, ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం, తదనంతరం నమోదవుతున్న పోలీస్ కేసులు నిరూపిస్తున్నాయి.

వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టిన మాజీ సీఐడీ ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) విజయ్ పాల్‌ని పోలీసులు ఎట్టకేలకు మంగళవారం అరెస్ట్ చేశారు.

ఆయన జగన్‌ మెప్పు కోసం చేసింది కొంతకాగా, స్వతహాగా అహంకారంతో చేసింది మరికొంత. కనుకనే రఘురామ కృష్ణరాజు ఓ సిటింగ్ ఎంపీ అని కూడా ఆలోచించకుండా విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారనుకోవచ్చు.

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, మాజీ ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, విజయ్ పాల్‌ ముగ్గురూ కలిసి చేసిన నిర్వాకాల జాబితా చాలా పెద్దదే ఉంది. వాటిలో రఘురామని చిత్రహింసలు పెట్టడం కూడా ఒకటి.

కనుక ఆనాడు జగన్‌ ప్రోత్సాహం, అండదండలు చూసుకొని పేట్రేగిపోయిన ప్రతీ ఒక్కరూ ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు.

జగన్‌ కళ్ళలో ఆనందం చూసేందుకు తమ పరిధి దాటి వ్యవహరించిన ప్రతీ ఒక్కరూ బలైపోతుండగా, జగన్‌ మాత్రం ఎప్పటిలాగే రాజకీయాలు చేసుకుంటున్నారు. జమిలి ఎన్నికలొస్తే గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉన్నారు.

అంటే ఇటువంటి సమస్యల నుంచి జగన్‌ అవలీలగా బయటగలరని, మళ్ళీ కొత్త సైన్యం తయారు చేసుకొని యుద్ధం చేయగలరని స్పష్టమవుతోంది.

కనుక రాజకీయాలలో ఉన్నవారందరికీ, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీస్ అధికారులకి దీనినో ‘కేస్ స్టడీ’గా భావించి సరైన వ్యక్తులతో కలిసి సరైన దారిలో పయనించడం చాలా అవసరమని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories