హైదరాబాద్లో కబ్జా అయిన చెరువులు, కాలువలని విడిపించేందుకు రేవంత్ రెడ్డి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేస్తే, అది అందరితో పాటు ఆయన సొంత అన్నయ్య తిరుపతి రెడ్డికి కూడా నోటీస్ ఇచ్చింది. మాదాపూర్లో అమర్ సొసైటీలో ఆయన నివాసం బఫర్ జోన్లో ఉన్నందున దానిని కూల్చేస్తామని నోటీస్ అంటించి వెళ్ళారు.
మరే ప్రభుత్వంలోనైనా ఓ కార్పొరేటర్ స్థాయి నేతల బందుమిత్రుల జోలికి పోయేందుకు కూడా ఎవరూ సాహసించరు. కానీ సిఎం రేవంత్ రెడ్డి సొంత అన్న ఇల్లు కూల్చేస్తామని హైడ్రా నోటీస్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దీనిపై తిరుపతి రెడ్డి స్పందిస్తూ, “నేను చాలా కాలం క్రితం ఈ ఇంటిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వద్ద కొనుగోలు చేశాను. ఆ సంస్థ అన్నీ సక్రమంగానే ఉన్నాయని చెప్పింది. ఆ డాక్యుమెంట్స్ లాయర్కి చూపిస్తే ఆయన కూడా సక్రమంగానే ఉన్నాయని చెప్పడంతో ఈ ఇంటిని కొన్నాను.
అప్పటికి ఈ నియమ నిబంధనలు లేకపోవడం వలన రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు దుర్గం చెరువు బఫర్ జోన్ పరిధిలో ఈ ఇల్లు ఉందని చెపుతూ నోటీస్ ఇచ్చారు.
నేను ముఖ్యమంత్రి సోదరుడినే కావచ్చు. కానీ నియమ నియమ నిబంధనలకు, చట్టానికి అతీతుడిని కాను. కనుక నాకు కొంత సమయం ఇస్తే నా సామాను తీసుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను,” అని అన్నారు.
“ముఖ్యమంత్రి మీ తమ్ముడే కదా? ఓ మాట చెప్పితే ఆగిపోతుంది కదా?” అని విలేఖరులు ప్రశ్నించగా, “నిజమే. కానీ… ముఖ్యమంత్రి నా ఒక్కరి కోసమే పనిచేయరు. కనుక నేను ఆయనపై ఒత్తిడి చేయకూడదు. చేయను కూడా.
నిజానికి బిఆర్ఎస్ హయాంలో చాలా అవినీతి, అక్రమాలు జరిగాయి. కనుక వాటిని కప్పి పుచ్చుకునేందుకే వారు హైడ్రాతో కూడా రాజకీయాలు చేస్తున్నారు. నేను ఇక్కడ ఉంటున్నందున వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు. అయితే వాళ్ళు నన్ను టార్గెట్ చేయడం వలన సొసైటీలో మిగిలిన అందరూ నష్టపోతున్నారు. ఒకవేళ నేను ఇక్కడ ఉండకపోయి ఉంటే వారు పట్టించుకునేవారు కారు. నా వలన సొసైటీలో మిగిలినవారు ఇబ్బంది పడేవారు కారు,” అని తిరుపతి రెడ్డి అన్నారు.
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతాయని సిఎం రేవంత్ రెడ్డి బుధవారమే చెప్పారు. ఒకవేళ తన ఇల్లు, తమ కుటుంబ సభ్యులు ఇళ్ళు ఉన్నా కూల్చేయవచ్చని చెప్పారు. కనుక ఇప్పుడు వెనక్కు తగ్గలేరు. అయితే సిఎం రేవంత్ రెడ్డి అన్నగారు తిరుపతి రెడ్డి చెప్పిన్నట్లుగా, ఈ రాజకీయాల వలన సొసైటీలో అందరూ నష్టపోతుండటమే బాధాకరం.




