జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధానమంత్రిగా దేశాన్ని ఏలుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ని తెలంగాణలోనే రేవంత్ రెడ్డి ఓడించి మూల కూర్చోబెట్టారు. ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచి ఉంటే ఈసారి కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి దక్కేది. కానీ రేవంత్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడ్డారు. బహుశః అందుకే కేటీఆర్ ఆయనపై ఇంతగా రగిలిపోతున్నారేమో?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావు ఎన్ని శాపాలు పెట్టినా ఫలించలేదు. వారు ముగ్గురూ చూస్తుండగానే రేవంత్ రెడ్డి 15 నెలల పాలన పూర్తిచేసుకున్నారు. కేసీఆర్ నేడు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు కనుక ఎప్పటిలాగే ప్రగల్భాలు పలకడం మానుకోరు.
అయితే కేసీఆర్ గృహ నిర్బందం నుంచి బయటకు వస్తున్నప్పుడే తెలంగాణ బీజేపి మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం మరో ఆర్నెల్లు మాత్రమే గడువు మిగిలుందని, తర్వాత బీజేపి అధికారంలోకి వస్తుందన్నారు.
అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు కలిసి ముహూర్తం పెట్టేశాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలు నిజమా కాదా అనేది నేడు కేసీఆర్ మాటలతో లేదా భవిష్య కార్యాచరణతో స్పష్టమవుతుంది.
ఈలోగా రేవంత్ రెడ్డి కుర్చీ కింద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా మంట పెడుతున్నారు కూడా. రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని బీసీ ముఖ్యమంత్రి వస్తారని చెప్పేశారు.
కాంగ్రెస్లో కూడా లుకలుకలు మొదలయ్యాయి కనుక బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు చక్రం తిప్పేందుకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోందని భావించవచ్చు.




