తెలంగాణ ఏర్పడి తొలిసారిగా కేసీఆర్ సిఎం అయిన కొత్తలో ప్రధాని మోడీతో చాలా సఖ్యతగా ఉండేవారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తే కేసీఆర్ స్వయంగా వెళ్ళి సాదరంగా ఆహ్వానించేవారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్సవం కలిసే చేశారు.
కానీ ఆ తర్వాత ప్రధాని మోడీతో కేసీఆర్ ఏవిధంగా వ్యవహరించారో, అలా ఎందుకు వ్యవహరించారో అందరికీ తెలుసు. చివరికి గవర్నర్ తమిళసైని కూడా ఆయన ప్రతినిధిగానే భావిస్తూ ఆమె పట్ల కూడా అనుచితంగా వ్యవహరించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తండ్రి బాటలోనే నడుస్తారు. కనుక అయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల చాలా అనుచితంగా మాట్లాడుతుంటారు.
కానీ బిజేపిని, ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీకి చెందిన సిఎం రేవంత్ రెడ్డి మాత్రం వారికి పూర్తి భిన్నంగా రాజకీయాలలో హుందాతనం పాటిస్తుంటారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిసి వస్తుంటారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రోటోకాల్ మర్యాదలు పాటిస్తారు.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రధాని మోడీతో కలిసి అధికార కార్యక్రమాలలో పాల్గొంటారు. వేదికపై బహిరంగంగానే తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తారు. మాకు మీ ఆశీర్వాదాలు కావాలని చెప్తారు.
కానీ ప్రధాని మోడీ బహిరంగ సభలో తన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలకు హుందాగా, ధీటుగా జవాబు చెప్పడానికి వెనకాడరు. బంగారం కొనవద్దు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోండని ప్రధాని మోడీ చేసిన సూచనలపై సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరంగా రాజకీయ కోణంలో విమర్శించారు.
కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని మోడీ సూచనలను పాటిస్తూ తన కాన్వాయ్ని మూడొంతులు తగ్గించేసుకున్నారు. శనివారం కేవలం మూడు కార్ల కాన్వాయ్తో సచివాలయం చేరుకున్నారు.
తద్వారా ప్రధాని మాటకి విలువిచ్చారు. అయన సూచనలో మంచిని గ్రహించి ఆచరించారు తప్ప బిజేపికి చెందిన మోడీ చెప్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన తానెందుకు పాటించాలని అనుకోలేదు.
రాజకీయాలలో ఇలాంటి సంబంధాలు, ఇలాంటి హుందాతనం చాలా అవసరమే.




