కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో ఆయనకు జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నోటీస్ ఇవ్వడం మహా నేరం అన్నట్లు బిఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు.
“కేసీఆర్కి ఎంతో పేరు తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఆయన ప్రతిష్టని దెబ్బతీయాలనే దురాలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వమే మేడిగడ్డ బ్యారేజ్ కింద బాంబులు పెట్టి పేల్చి క్రుంగిపోయేలా చేసిందేమో?అప్పుడు మళ్ళీ వాటిని నిర్మించే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 20-30 శాతం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతోందేమో?” అని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.
కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడటం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి, నిరుపయోగంగా మారిందని సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ చేత విచారణ జరిపిస్తున్నప్పుడు, కేటీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల ప్రస్తావన చేయడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది కదా?
కేవలం మూడు పిల్లర్లు పునర్నిర్మిస్తేనే కమీషన్లు వస్తాయని కేటీఆర్ చెపుతున్నప్పుడు, సుమారు 90 పిల్లర్లతో కేసీఆర్ హయంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించినప్పుడు ఎంత కమీషన్ వచ్చి ఉండాలి?అనే ప్రశ్న తలెత్తుతుంది కదా?
అయినా తెలంగాణ సాధించి, అభివృద్ధి చేసినంత మాత్రాన్న కేసీఆర్ అవినీతికి పాల్పడరని ఎలా అనుకోగలము?తెలంగాణ ఉద్యమాలకు ముందు ఆయన కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఏవిదంగా ఉంది?ఇప్పుడు ఏవిదంగా ఉంది?
ఇదివరకు దేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకున్న కేసీఆరే, పదేళ్ళ పాలన తర్వాత దేశంలో అత్యంత ధనిక పార్టీలలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఒకటని స్వయంగా చెప్పుకున్నారు. కేవలం ఒకటిన్నర దశాబ్ధాలలో ఆయన కుటుంబం, బిఆర్ఎస్ పార్టీ ఇంతగా ఎలా ఎదిగింది?
జనసేన పార్టీని నిర్వహించుకునేందుకు నేటికీ సినిమాలు చేయక తప్పడం లేదని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకుంటారు.
కానీ రాజకీయాలు తప్ప మరేమీ చేయని కల్వకుంట్ల కుటుంబం సొంత మీడియాని పెట్టుకొని, జాతీయ రాజకీయాలలో ప్రవేశించే స్థాయికి ఎలా ఎదిగింది?అని సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రుల ప్రశ్నలకు జవాబు లభించదు.




