ఒకప్పుడు అమితాబ్ కు పోటీ ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్ హీరో రిషికపూర్ తన స్వీయ జీవిత చరిత్ర ‘ఖుల్లాం ఖుల్లా: రిషికపూర్ అన్ సెన్సార్డ్’ పేరుతో విడుదల చేసిన పుస్తకంలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. రిషికపూర్ తండ్రి అయిన రాజ్ కపూర్ దగ్గర నుండి దావూద్ ఇబ్రహీం వరకు అనేక విషయాలను ప్రస్తావిస్తూ బాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు, రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు సృష్టించాడు.
సినిమాలు, హీరోయిన్లు, మద్యం తాగడం… ఇవే బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన తన తండ్రి రాజ్కపూర్ లోకమని, ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్లు అయిన నర్గీస్, వైజయంతీమాల తదితర హీరోయిన్లతో తన తండ్రికి సంబంధాలు ఉండేవని సదరు పుస్తకంలో పేర్కొన్నారు. అలాగే తన చిన్ననాటి అనుభవాలు, తన కొచ్చిన పేరు ప్రఖ్యాతుల గురించి కూడా అందులో ప్రస్తావించాడు.
భారత మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను తాను దుబాయ్లో రెండు సార్లు కలిశానని, అతడితో కలిసి టీ కూడా తాగానని పేర్కొన్నాడు. తొలిసారి 1988లో దుబాయ్లో ఆశా భోంస్లే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తన వద్దకు దావూద్ మనిషి ఒకరు వచ్చి, దావూద్ ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ తనను దావూద్ సాదరంగా ఆహ్వానించాడని, తాను మద్యం తాగనని, అందుకే టీకి పిలిచానని దావూద్ తనతో చెప్పాడని రిషి పుస్తకంలో వివరించారు.
మరోసారి 1989లో దుబాయ్లోనే ఓ లెబనీస్ షాపులో బూట్లు కొనుక్కునేందుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న దావూద్ ని మరోసారి కలిశానని చెప్పాడు. ఆయన చేతిలో మొబైల్ ఫోన్, చుట్టూ పది మంది బాడీగార్డులు ఉన్నారని, షాపులో తనకేం కావాలో తీసుకోమని చెప్పినా తాను తిరస్కరించానని రిషి తెలిపారు. భారత్ లో ఎంతోమంది రాజకీయ నేతలు తన జేబులో ఉన్నారని, వారికి చాలా డబ్బు పంపించానని దావూద్ తనకు చెప్పాడని రిషికపూర్ తన జీవిత చరిత్రలో వివరించడం సంచలనాత్మకమైంది.



