ఒక్కోసారి ఒక్కో ప్రభంజనం వచ్చినప్పుడు ఎంత బలమైన పార్టీ అయినా దానిలో కొట్టుకుపోవడం సహజమే. కనుక వైసీపీ నేతలు ఒడిపోయినందుకు పరువు పోయిందని బాధపడటం మానేశారు.
అధికారంలో ఉన్నప్పుడు 175తో అందరి కళ్ళకు గంతలు కట్టిన జగన్, ఓడిపోయాక “రాబోయేది మన ప్రభుత్వమే…’ అంటూ మళ్ళీ గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. రోజా వంటివారు జగన్ చేత గంతలు కట్టించుకొని కూటమి ప్రభుత్వానికి వార్నింగులు ఇస్తున్నారు.
రాజకీయాలలో ఉన్నవారు ఏదో ఓ సమయంలో మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. లేకుంటే టాలీవుడ్ హీరోయిన్లల కనుమరుగు అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక రోజా వార్నింగులను అలాగే చూడాలి.
“రాబోయేది మన ప్రభుత్వమే..’ అని అనుకుంటే చాలు ఒళ్ళు పులకరిస్తుంది. కానీ ‘మన పరిస్థితి ఏమిటి?’ అని ఆలోచిస్తే ఒళ్ళు జలదరిస్తుంది.
వైసీపీకి బలమూ-బలహీనత, మిత్రుడు-శత్రువు, ఉద్దరించేవాడు-నశింపజేసేవాడు అన్నీ ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కనుక జగన్ ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు, కార్యాచరణ వైసీపీ భవిష్యత్ని నిర్ణయిస్తాయి.
ఓటమి షాక్ నుంచి తేరుకోవడానికి ఏ పార్టీకైనా ఆరు నెలల సమయం చాలు. కానీ జగన్, కేసీఆర్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ‘గృహ నిర్బంధం’ విధించుకొని సంక్రాంతికి బయటకు వస్తామని లీకులు ఇస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీని నడిపించేందుకు కేసీఆర్కి సమర్ధుడైన కొడుకు, కూతురు, మేనల్లుడు ముగ్గురున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా పోరాడుతున్నారు. కానీ జగన్ వెనుక ఎవరున్నారు?అంటే ఒక్కరు కనబడరు.
సీనియర్ నాయకులు అడపా దడపా మీడియా ముందుకు వచ్చి ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారే తప్ప ఎవరూ చొరవ తీసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇష్టపడటం లేదు. అధినేత తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని సేద తీరుతూ ఆదేశాలు జారీ చేస్తుంటే, వాటిని పాటిస్తూ కేసులలో చిక్కుకోవడం అవసరమా?అని అందరూ నిశబ్ధం పాటిస్తున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాష్ట్రంలో పర్యటిస్తూ నిత్యం ప్రజల మద్య తిరుగుతుంటే, మన యువరాజావారు మాత్రం తాడేపల్లి ప్యాలస్ వదిలి బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. జగన్ ధోరణి ఈవిదంగా ఉంటే ‘రాబోయేది మన ప్రభుత్వమే’ అంటే ఎవరు మాత్రం నమ్ముతారు?




