బటన్ నొక్కడం మీద ఉన్న శ్రద్ద జగన్ కు కాస్త రోడ్ల మీద కూడా ఉంటే బాగుండు అంటూ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలే ముఖ్యమంత్రి విధి అన్న చందంగా కార్యక్రమాల రూపకల్పన ఉంటుంది కానీ అభివృద్ధి, మౌలిక వసతుల కనీస పర్యవేక్షణ కూడా లేకపోవడం దురదృష్టకరం.
గడిచిన నాలుగేళ్లుగా వాహనదారులు ఈ రోడ్ల మరమ్మత్తులు లేక వాహనాలతో సర్కస్ ఫీట్లే చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిపక్ష నేతలు విమర్శించినా, ప్రజలు గగ్గోలు పెడుతున్న “నిమ్మకు నీరెత్తినట్లుంది” ప్రభుత్వ వైఖరి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలు VS అధికార పక్షం అన్న చందంగా ఉన్న తరుణంలో ఇక రాష్ట్ర సమస్యలను ప్రజలే భుజానికి ఎత్తుకున్నట్లుంది వాతావరణం చూస్తుంటే.
అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి కృష్ణదేవి పేట వెళ్లే రహదారి దుస్థితి చూసి కొందరు వినూత్న నిరసన తెలిపారు. సరిగ్గా రోడ్ మధ్యలో ఉన్న పెద్ద గుంట తో ఎన్నో ఇక్కట్లు పడుతున్న వాహనదారులను అప్రమత్తం చేయడానికి అక్కడ ఒక మొక్కను నాటి “ఇది జగనన్న గొయ్యి… కాస్త చూసుకొని వెళ్ళండి” అంటూ ఫ్లెక్సిలను ఏర్పాటు చేశారు.
కనీసం ఇటువంటి ఫ్లెక్సీలను చూసి అయినా ప్రభుత్వ అధికారులు తమ మొద్దు నిద్ర విడతారో లేదో? లేకపొతే ఈ ఫ్లెక్సీల మీద కూడా మన జగన్న బొమ్మే ఉంది ఇది కూడా మన పార్టీ ప్రచారానికి వాడేసుకుందాం అంటూ సంబర పడతారో!



