బుడమేరు ముంపుతో అల్లాడుతున్న విజయవాడ వాసులను ఆదుకోవడానికి ప్రభుత్వం తో పాటుగా తమవంతు చేయూతగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వరద బాధితులకు సహాయాన్ని అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన తాగునీరు, నిత్యావసర సరుకులను, దుప్పట్లు, బట్టలు, మెడిసిన్స్ ఇలా ఎవరికీ తోచిన రీతిలో వారు ఆదుకుంటున్నారు.
ఇలా విజయవాడ వరద బాధితులకు ఒక పక్క మానవత్వంతో కూడిన మనుషులు చేయుత గా నిలుస్తుంటే మరోపక్క వీరి నిస్సహాయతను అవకాశం గా తీసుకుని మరికొంతమంది వరద ప్రభావిత ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతు వారి అమానుషత్వాన్ని చూపిస్తున్నారు.
ఒకే గూటిలో రెండు రకాల పక్షులు ఉన్నట్టు ఒక పక్క సాయమందించే వారు కనపడుతుంటే, మరో పక్క దోచుకునే వాడు దర్శనమిస్తున్నాడు. బుడమేరు ఉప్పొంగడంతో వరద విజయవాడలోని కొన్ని ప్రాంతాలలో ఒక్కసారిగా చుట్టూ ముట్టడంతో ఎక్కడిక్కడ ఇళ్లకు తాళాలు వేసి ప్రాణాలు కాపాడుకోవడానికి బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఇదే అదునుగా దొంగలు తమ చేతి వాటం చూపిస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి ఇళ్లల్లో ఉన్న విలువైన వస్తువులను దోచుకు పోతున్నారు. చాల మంది ఆ వరద ఉదృతి చూసి ప్రాణాలు మిగిలితే చాలు అంటూ కట్టుబట్టలతో పిల్లలను భుజాన వేసుకుని ఇళ్ల నుండి బయటకు వచ్చేసారు.
అయితే ఇప్పటికే ఇంటిలో ఉన్న విలువైన ఎలక్ట్రానిక్ సామానులు అన్ని వరద పాలవ్వడంతో కన్నీరు మున్నీరవుతున్న ప్రజలకు ఇప్పుడు ఈ దొంగల బెడద దడ పుట్టిస్తుంది. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాల నుండి షెటర్లు వేసిన షాపుల వరకు అన్నింటి మీద తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు ఆ అగంతకులు.
భార్య పిల్లలని సురక్షిత ప్రాంతాలకు చేర్చి తిరిగి ఇంటికి వచ్చి చూసే లోపే ఇంటిలో దాచిన బంగారం మాయమయింది అంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న వాంబే కాలనీ, సింగినగర్, ఆర్ఆర్ పేట లో దుండగులు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులకు కంప్లైన్స్ వరదల్లా వస్తున్నాయి.
వరదలతో సర్వం కోల్పోయి కేవలం ప్రాణాలతో మాత్రమే మిగిలాము అంటూ కంటికి కునుకు లేకుండా రోధిస్తున్న బాధితులకు మానవత్వం తో అండగా నిలవాల్సింది పోయి ఇలా వారి నిస్సహాయతను అవకాశముగా తీసుకుని రెచ్చిపోతున్న దొంగలను పట్టుకుని బాధితులకు కొంత మేరకైనా ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత ఉన్నత అధికారులు మీద ఉంది.
వరదలతో, విష పురుగులతో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులకు ఇప్పుడు ఈ దొంగలు మరో సమస్యగా మారారు. అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే ఈ సమస్య మీద స్పందించి వారి రక్షణకు తగిన ఏర్పాట్లు చేసి చోరీలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.




