సుప్రీంకోర్టు, హైకోర్టుల దాకా వెళ్ళిన నగరి ఎమ్మెల్యే రోజా ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై… “నా మాటలు అనితకు బాధ కలిగించి ఉంటే క్షమించాలి, అలాగే నా వ్యవహార తీరుతో గానీ, నా హావభావాలతో గానీ ఎవరైనా నొచ్చుకుని ఉంటే, నిరభ్యంతరంగా క్షమాపణలు కోరుతున్నానని” చెప్పినట్లుగా తెలుస్తోంది. దాదాపు గంటన్నర్ర సేపు జరిగిన ఈ సమావేశంలో రోజా పూర్తి స్థాయిలో కమిటీకి సరెండర్ అయ్యే వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియా వర్గాల సమాచారం.
“మొదటిసారిగా ఎన్నికైన శాసనసభ్యురాలిని కావడంతో, తనకు కొన్ని నియమ నిబంధనలు తెలియవని, ఈ క్రమంలో కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమేనని, అయితే ఉద్దేశ పూర్వకంగా ఎవరిని టార్గెట్ చేసి నొప్పించే ఉద్దేశం తనది కాదని, ఈ విషయంలో తప్పులు దొర్లి ఉంటే క్షమించాలని, అయితే టిడిపి నేతలు కూడా నన్ను రెచ్చగొట్టారు, అందుకే నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది” అంటూ వివరణ ఇచ్చుకోవడంతో దాదాపుగా రోజా ఉదంతం ఓ కొలిక్కి వచ్చినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తానూ ఇచ్చిన వివరణపై రోజా మీడియాతో ఏ విధమైన వ్యాఖ్యలు చేయనప్పటికీ, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు మాత్రం… రోజా ఇచ్చిన వివరణను తీసుకున్నామని, దీనిపై తమ నివేదికను త్వరలోనే స్పీకర్ కు ఇస్తామని వెల్లడించారు. అలాగే ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు బండారు సత్యనారాయణ మాట్లాడుతూ, రోజా క్షమాపణలు చెప్పారని, సదరు విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకు వెళతామని అన్నారు.



