ఎన్నికలలో వైసీపీ ఓటమి తర్వాత ఇక తమకి కష్టాలు తప్పవని జగన్తో సహా వైసీపీ నేతలందరూ తీవ్ర ఆందోళన చెందారు. ఆ భయంతో కొందరు రాజకీయ సన్యాసాలు ప్రకటించగా కొందరు టీడీపీ, జనసేనలలో చేరిపోయారు. మిగిలినవారు కలుగుల్లో ఎలుకల్లా ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా మౌనంగా ఉండిపోయారు.
కానీ వారిపై ప్రతీకార చర్యలు ఉండవని స్వయంగా సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పదేపదే చెపుతుండటమే కాక తమ మాటలకు కట్టుబడ్డారు. అప్పటి నుంచే వైసీపీ నేతలకు తమ భయాలు, ఆందోళన అర్దరహితమని నమ్మకం కలిగింది. జగన్తో సహా మళ్ళీ అందరూ కలుగుల్లో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
ఆ మద్యన పవన్ కళ్యాణ్ మాట కాదనలేక సిఎం చంద్రబాబు నాయుడు కొందరు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్పై కేసులు నమోదుకి అంగీకరించినా మళ్ళీ ఆ తర్వాత అటువంటి ఆలోచన కూడా చేయకపోవడంతో వైసీపీ సోషల్ మీడియా కూడా మళ్ళీ ధైర్యం పుంజుకుంది.
చంద్రబాబు నాయుడుని వికృతంగా చూపుతూ ఫోటోలు, వీడియోలు పెడుతోంది. చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంపై అనుచితమైన కామెంట్స్ చేస్తోంది.
తిరుపతి ఘటనలో వైసీపీ నేతలు మూకుమ్మడిగా విరుచుకు పడిన తీరు చూస్తే వారందరికీ పూర్తిగా భయం పోయిందని స్పష్టమవుతోంది.
ముఖ్యంగా వారిలో మాజీ మంత్రి రోజా గత రెండు రోజులుగా రోజుకు రెండు మూడుసార్లు ప్రెస్మీట్ పెడుతూ, తిరుపతి ఘటనకు సిఎం చంద్రబాబు నాయుడే పూర్తి బాధ్యుడని ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆయనది ఐరన్ లెగ్ అని ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో ఇటువంటి విషాద ఘటనలు జరుగుతుంటాయంటూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ చాలా రెచ్చిపోయారు.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి సనాతన వీరుడు అంటూ ఆమె చాలా మాటలే మాట్లాడారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో, పాలక మండలి అందరూ కూడా రాజీనామాలు చేయాలని రోజా డిమాండ్ చేశారు.
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్లతో సహా అందరిపై ఇంతగా విరుచుకుపడిన రోజా, శనివారం ఉదయం తిరుమల స్వామివారి దర్శనానికి వెళితే, ఆలయ అధికారులు, టీటీడీ సిబ్బంది ఆమెకు ప్రోటోకాల్ మర్యాదలతో బ్రేక్ దర్శనం చేయించి సాగనంపారు. దర్శనం చేసుకు వచ్చిన తర్వాత కూడా ఆమె మళ్ళీ మరోసారి టీటీడీ, సిఎం చంద్రబాబు నాయుడులపై నిప్పులు చెరిగారు.
ఇవన్నీ చూస్తున్న టీడీపీ, జనసేన సీనియర్ నేతలు, శ్రేయోభిలాషులు ముక్కున వేలేసుకుంటున్నారు. “వైసీపీ నేతలు ఇంతగా రెచ్చిపోతున్నా ఇంకా శాంతి మంత్రం జపించాల్సిన అవసరం ఉందా? రోజా వంటి వైసీపీ నేతలను కట్టడి చేయలేకపోవడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు ఏంటి అడ్డొస్తోంది?” అని ప్రశ్నిస్తున్నారు. వారికి ఎవరు జవాబు చెపుతారు? ఏమని చెపుతారు?




