‘కారు’ మబ్బులు తొలగిపోయాక ‘వెలుగు’ రావడం ప్రకృతి సహజం. అలాంటి సహజత్వానికి భిన్నత్వంగా ఆలోచించడమే వైసీపీ నేతల స్పెషల్. భూలోకంలో కాకుండా, ఉహల ప్రపంచంలో బ్రతికే వారికి ‘కారు’ మబ్బులు ఎప్పటికి తొలగిపోవు అని చెప్పడానికి నిదర్శనమే ఒక్కొక్క వైసీపీ నేతల వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.
కళ్ళు మూసుకుంటే ఐదేళ్లు అయిపోతాయి అనేటటువంటి వ్యక్తి ఒక పార్టీని నడుపుతున్నారు, ఆయన ముఖ్యమంత్రి స్థాయి నేత అంటే… ఎవరైనా నమ్ముతారా? ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా మారిన జగన్ మాటలకు చిడతలు కొట్టడమే రోజా వంటి నేతలు చేసే పని.
ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో ‘జగనన్న జగనన్న… నీకు సెల్యూట్’ అంటూ ‘చిడతలు’ కొట్టే ఈ ‘జబర్దస్త్’ నటీమణి, నేడు మీడియా ముందుకు వచ్చి సగర్వంగా తలెత్తుకుని మాట్లాడుతుందట! అది కూడా ఓటమి పాలైనందుకు!
నిజేమేనండి… ఓడిపోయినందుకు గర్వంగా ఉందని స్వయంగా రోజానే సెలవిచ్చింది. ఎందుకు ఓడిపోయింది అని ప్రశ్నిస్తే… ప్రజలకు మంచి చేసాము, అందుకే ఓడిపోయిందని జవాబు కూడా ఇచ్చింది. ఇది కదా వైసీపీ వర్గానికి కావాల్సిన ‘ఎమోషన్!’
గత రెండు, మూడు నెలలుగా వేడెక్కిపోయి ఉన్న ఏపీ రాజకీయ వాతావరణంలోకి, ఒక్కప్పటి సినీ నటి గనుక కాస్త నవ్వులు పూయించడానికి, ప్రజలకు వినోదం పంచడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందేమో అని అనిపించక మానదు.
చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి గానీ, మంచి చేసి ఓడిపోతే సిగ్గెందుకు అని చెప్పిన రోజా ఇప్పుడు నిజంగా సిగ్గుపడాలో లేదో నిర్ణయించుకునే దశలో లేదని ఆమె వ్యాఖ్యలు చూస్తే అర్ధమవుతుంది.
నగరి నియోజకవర్గ ప్రజలు ఆమెకు కాస్త అర్ధమయ్యే విధంగా చెప్పండర్రా..! అప్పుడైనా ఊహల ప్రపంచం నుండి వాస్తవ స్థితిలోకి వస్తారేమో!




