ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో సోమవారం సిఎం జగన్ పర్యటనలో మంత్రి పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డి, మంత్రి రోజా వర్గాల మద్య విభేదాలు ఫ్లెక్సీ బ్యానర్లు సాక్షిగా బయటపడ్డాయి. నగరి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల వైసీపీ నేతలు జగన్కు స్వాగతం చెపుతూ దారిపొడవునా అనేక ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు.
నగరి వైసీపీ ఇన్ఛార్జ్ కెజె కుమార్, వడమాలపేట వైసీపీ ఇన్ఛార్జ్ మురళి, పుత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ అమ్ములు, నిండ్ర వైసీపీ ఇన్ఛార్జ్ చక్రపాణి ఈ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటన్నిటిలో జగన్, మంత్రి పెద్దిరెడ్డి, వారి ఫోటోలే ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కడా నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఫోటోలు పెట్టలేదు.
ఇక నగరిలో రోజా అధ్వర్యంలో ఈ బటన్ నొక్కుడు సభ జరుగుతున్నందున, వారెవరూ జనసమీకరణకు రోజా అనుచరులకు సహకరించకపోవడంతో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్ళి బ్రతిమలాడినా మహిళలు జగన్ సభకు వచ్చేందుకు నిరాకరించిన్నట్లు తెలుస్తోంది.
ఈ బటన్ నొక్కుడు సభకు తరలించేందుకు రోజా అనుచరులు నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన సుమారు 50 బస్సులు సంపాదించగలిగారు కానీ వాటిలో జనాలే లేరు. రోజా అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పుత్తూరు ఆర్టీసీ డిపోకు చెందిన కొన్ని బస్సులను కూడా తీసుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి ముందు జగన్ స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి వర్గానికి చెందిన కేజే శాంతి చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న మంత్రి రోజాతో చేతులు కలపాలని ప్రయత్నించారు. పార్టీలో నేతలందరూ విభేధాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని జగన్ వారికి చెప్పినా ఇద్దరూ చేతులు కలిపేందుకు ఇష్టపడలేదు. జగన్ స్వయంగా చెయ్యి పట్టుకొని చెప్పడంతో కేజే శాంతి అయిష్టంగానే రోజా చేతిని తాకారు తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. తర్వాత రోజా మొహం తిప్పుకొని జగన్తో కలిసి ముందుకు వెళ్ళిపోయారు తప్ప శాంతితో మాట్లాడలేదు.
మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఆమె పరిస్థితి ఇది. ఆమెకు సొంత పార్టీలోనే నేతలతో పడదు. ఆమె మంత్రి పదవిలో ఉన్నా ఫ్లెక్సీ బ్యానర్లలో ఆమె ఫోటో కూడా వేయలేదు.
గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం ఏర్పడినప్పుడు రోజా కేవలం 2,681 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే గెలిచారు. కానీ ఈసారి ఆ ప్రభంజనమూ ఉండదు పైగా మంత్రి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులే నగరిలో ఆమెను ఇంతగా వ్యతిరేకిస్తున్నారు.
కానీ రోజాకు తన పరిస్థితి పూర్తిగా అర్దమైన్నట్లు లేదు. అందుకే పెద్దిరెడ్డి తన కుర్చీ కింద మంట రాజేస్తున్నా చిర్నవ్వులు చిందిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మీద చవుకబారు వ్యాఖ్యలు చేస్తూ జగన్ను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు.



