భారత్లో మరే మతాచారాలు, వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడనివారు సైతం హిందూమతం విషయంలో తమ అభిప్రాయాలు చెపుతుంటారు. హిందూమతం గురించి కనీసం అవగాహన లేని హిందువులే తమ మతం, ఆచారాలు, దేవుళ్ళ గురించి చాలా చులకనగా మాట్లాడుతుంటారు. కనుక ఇతర మతస్తులకు హిందూ మతమంటే అలుసుగా అనిపించడం సహజం.
కోట్లాది మంది భక్తులకు పరమ పవిత్రమైన తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు తేలిన తర్వాత కూడా ఆ అపచారానికి పాల్పడినవారు నిర్భయంగా ప్రభుత్వం, టిటిడీపై ఎదురుదాడులు చేశారు. ముస్లింలలో ‘ట్రిపుల్ తలాక్’ ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం అమలు చేసినప్పుడు దానిపై దేశవ్యాప్తంగా ముస్లింలతో పాటు హిందువులు, లౌకికవాదులమని చెప్పుకునే రాజకీయ నాయకులు ఎంత తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రెండు ఉదాహరణలు చూస్తే హిందూమతం విషయంలో ప్రజలు, పార్టీల అభిప్రాయాలు ఒకవిధంగా, ఇతర మతాల విషయంలో మరోకలాగా ఉంటాయని స్పష్టమవుతోంది కదా?
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు నమోదవడం కూడా ఇదే సూచిస్తోంది.
అయ్యప్పస్వామి బ్రహ్మచారి కనుక ఆయన ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అంటూ10-50 ఏళ్ళ మద్య మహిళలకు శబరిమలలో ప్రవేశం లేదు.
అయితే హిందూ మహిళలు, ముఖ్యంగా కేరళలో హిందూ మహిళలు ఈ సాంప్రదాయాన్ని చాలా గౌరవిస్తారు. కానీ దీనిపై అభ్యంతరం చెపుతూ 2017 లోనే సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు పడ్డాయి.
వాటిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం మతాచారాల పేరుతో మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించడం వారి ప్రాధమిక హక్కుకి భంగం కలిగించినట్లేనని తీర్పు చెపుతూ మహిళలపై ఉన్న ఈ ఆంక్షలను ఎత్తివేస్తూ 2018లో తీర్పు చెప్పింది.
సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా తీర్పు చెప్పినప్పటికీ మహిళలు ఆలయ మర్యాదకు భంగం కలిగించేందుకు ఇష్టపడకపోవడం విశేషం.
కనుక మళ్ళీ ఈ అంశంపై సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు పడ్డాయి. వాటిపై 2019 నుంచి సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. తాజాగా 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, “ఇది మానవ హక్కుల సమస్య కాదని మతాచారాలకు సంబందించిన అంశంగా పరిగణించాలని సూచించారు.
దేశంలో కొన్ని అమ్మవారి ఆలయాలలో పురుషులకు ప్రవేశం లేదని, ఒకవేళ వారు అమ్మవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా మహిళలల్లాగ చీర కట్టుకొని అలంకరించుకొని దర్శించుకోవాల్సి ఉంటుందని తుషార్ మెహతా వాదించారు.
కేరళలోని అనంత పద్మనాభ ఆలయంలో స్వామివారిని పురుషులు దర్శించుకోవాలంటే చొక్కా, బనియన్ లేకుండా కేవలం తువాలు లేదా కండువా వేసుకోవాల్సి ఉంటుంది. చొక్కా, ఫ్యాంట్ ధరించినవారిని లోనికి అనుమతించరు.
దేశంలో అనాదిగా వివిధ ఆలయాలలో వివిధ ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయని వాటి ప్రకారమే ఆలయ నిర్వహణ కొనసాగుతుందని చెప్పారు. కనుక శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆంక్షలు తప్పుగా భావించరాదని వాదించారు.
దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగుతోంది.






