మెగా హీరోల ఫంక్షన్ ఏదైనా సరే… అక్కడ ‘పవర్ స్టార్ పవర్ స్టార్’ అంటూ నినాదాలు మారుమ్రోగడం సర్వసాధారణమైన విషయం. పవన్ అభిమానుల చేసే ఈ నినాదాలు చాలా సార్లు మెగా హీరోలతో పాటు ఇతర హీరోలను కూడా ఇబ్బంది పెట్టిన వైనం అందరికీ తెలిసిందే. అయినా పబ్లిక్ లైఫ్ లో ఉంటారు గనుక, నవ్వులు చిందిస్తూ అలా ఉండిపోతుంటారు.
ఒకసారి మాత్రం అల్లు అర్జున్ కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక ‘చెప్పను బ్రదర్’ అనడంతో, పవన్ ఫ్యాన్స్ కు బన్నీ యాంటీ అయిపోయాడు. అలాగే మరొక సందర్భంలో నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు క్లాస్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో, సాయి ధరమ్ తేజ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ… పవన్ అభిమానులను ‘నేను ఆపలేను’ బ్రదర్ అన్నాడు. మామయ్య పేరుతో నినాదాలు చేస్తున్న వారిని తాను ఎలా ఆపగలను? అని చెప్పాడు.
నాగబాబు, బన్నీలు పవన్ అభిమానులకు క్లాస్ తీసుకున్నారుగా? అని ప్రశ్నిస్తే… అది వారి సొంత విషయమని, వాళ్ల సిట్యువేషన్ లోకి వెళ్లి తానూ కామెంట్ చేయలేనని చెప్పాడు. ముగ్గురు మామయ్యలంటే తనకు చాలా ఇష్టమని… వారి వల్లే అమ్మ, తాను, తమ్ముడు ఈ రోజు ఇలా ఉన్నామని తెలిపాడు. కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుండడంతో ఎలాంటి వివాద వ్యాఖ్యలు చేయకుండా అందరితో కలివిడిగా ఉంటున్నాడు సాయి.



