ఇదివరకు టిడిపి-జనసేనల పొత్తులు, ఆ తర్వాత టిడిపి-బీజేపీ పొత్తుల గురించి తీవ్ర ఆందోళన చెందిన వైసీపి ఇప్పుడు పోస్టల్ బ్యాలట్స్ గురించి చాలా ఆందోళన చెందుతోంది.
ఆ పార్టీల పొత్తులతో రాష్ట్రంలో కొన్ని సామాజిక వర్గాల ఓట్లు కూటమి వైపు వెళ్ళిపోతాయనే వైసీపిలో జగన్తో సహా అందరూ ఆందోళన చెందారు. అందుకే వాటి పొత్తులను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వారికి నచ్చలేదని ప్రతిపక్షాలు తమ ఆలోచనలు, వ్యూహాలను మార్చుకోవు. కనుక మూడు పార్టీలు పొత్తులు ఖరారు చేసుకొని కలిసి పోటీ చేశాయి. ఈ పొత్తుల వల్లనే అవి సగం విజయం సాధించాయని చెప్పవచ్చు. అంటే వైసీపి భయాలు నిజం కాబోతున్నాయన్న మాట!
ఇప్పుడు వైసీపి నేతలు పోస్టల్ బ్యాలెట్స్ గురించి ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారో ప్రజలందరికీ తెలుసు. అయితే 2024లో జరుగబోయే ఎన్నికలలో గెలిచేందుకు జగన్ ప్రభుత్వం 2019 నుంచే అనేక ప్రణాళికలు రూపొందించుకుని అమలుచేసింది.
కానీ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ఇంత దూరదృష్టితో ఆలోచించకపోయింది. ఈ 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిందో, ఎంతగా అవమానించిందో సామాన్య ప్రజలకు కూడా తెలుసు. వారితో అనుచితంగా వ్యవహరించినందుకు, ఇప్పుడు వారందరూ పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా ప్రతీకారం తీర్చుకుంటారని వైసీపి నేతలకు తెలుసు. అందుకే పదేపదే పోస్టల్ బ్యాలెట్స్ గురించి వైసీపి నేతలు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు.
కానీ వారి మాటలు వారి భయాలకు అద్దం పట్టగలవే తప్ప పోస్టల్ బ్యాలెట్స్ లోని ఉద్యోగులు, ఉపాద్యాయుల తీర్పుని మార్చలేవు కదా?కానీ మార్చాలని వైసీపి ప్రయత్నం చేయబోతున్నట్లు సజ్జల రామకృష్ణా రెడ్డి బయటపెట్టేశారు.
పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించేటప్పుడు కౌంటింగ్ కేంద్రాలలో టిడిపి ఏజంట్లతో గొడవ పెట్టుకొని వాటిని అడ్డుకోవాలన్నట్లు సజ్జల వైసీపి ఏజంట్లకు చెప్పడంతో టిడిపి అప్రమత్తమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, తాడేపల్లి పోలీసులకు వేర్వేరుగా పిర్యాదులు చేసింది.
పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి ‘మమ’ అనిపించగా ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్లో గొడవలు చేస్తే బయటకు పంపేస్తామంటూ ఆయన కూడా ‘మమ’ అనేశారు. కనుక పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్లో టిడిపి ఏజంట్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఏపీలో ఈసారి మొత్తం 5,39,189 పోస్టల్ బ్యాలెట్స్ నమోదయ్యాయి. వాటిలో
ఉపాధ్యాయులు: 1,60,000, పోలీసులు: 1,30,000, రెవెన్యూ: 60,000, ఇతర శాఖలు: 44,218, గ్రామ సచివాలయ ఉద్యోగులు: 50,000, అత్యవసర సర్వీస్ ఉద్యోగులు: 27,100, 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు: 13,755, దివ్యాంగులు: 12,718, సర్వీస్ ఓటర్లు: 41,398 మంది ఉన్నారు.
వీరిలో సచివాలయ ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు వైసీపికే పడే అవకాశం ఉంటుంది. కానీ ఉపాధ్యాయులు, పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు జగన్ ప్రభుత్వ బాధితులే. కనుక వీరిలో 90 శాతంకి పైగా వైసీపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేసి ఉండవచ్చు.
వారి ఓట్లతో పలువురు వైసీపి నేతల జాతకాలు తలక్రిందులు అవుతాయి. అది వైసీపి ఓటమికి కారణం అవుతుంది. అందుకే వైసీపి నేతలు ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ గురించి ఇంతగా ఆందోళన చెందుతున్నారు. ఈ భయం, ఆలోచన ముందు నుంచే ఉంటే నేడు ఇంతగా చింతించాల్సిన అవసరమే ఉండేది కాదు కదా? కానీ 5 ఏళ్ళు ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులతో ఆడుకొని ఇప్పుడు చింతించి ఏం ప్రయోజనం?




