నవ్యాంధ్ర రాజధానిగా గుంటూరు జిల్లాలోని 29 గ్రామాలను ఎంపిక చేసిన నాటి నుండి ఆ ప్రాంతంలో రాజధాని ఎంపికను వ్యతిరేకిస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్, అమరావతిలో నిర్మాణాలను అడ్డుకోవడానికి కూడా స్థానిక రైతులను రెచ్చగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వైసీపీ ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా అమరావతి నిర్మాణానికి కావాల్సిన కార్యక్రమాలను పూర్తి చేస్తుండడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు జగన్ వర్గం.
అయితే ఉన్నట్లుండి గురువారం నాడు ఒక సంచలనమైన వార్తకు తెరలేపింది జగన్ వర్గపు మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు నిదర్శనంలా నిలవాల్సిన రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో మూడు అడుగుల మేర నేల కృంగిపోయిందని… దీంతో ఒక్క సచివాలయమే కాక, అసలు రాజధానిగా అమరావతినే ప్రశ్నార్ధకం చేసేలా వరుస కధనాలు ప్రసారం చేసింది. అయితే అసలు జగన్ మీడియా చెప్తున్నట్లు సచివాలయం నిర్మాణ పరిసర ప్రాంతాల్లో నేల కృంగిన మాట వాస్తవమేనా? అన్న ప్రశ్న సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.
దీనిపైనే మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. భూసమీకరణ నుండి రాజధాని పనులను దగ్గరుండి సమీక్షలు జరుపుతున్న నారాయణ… సదరు వార్తలను కొట్టిపడేసారు. “సచివాలయంలో నేల కృంగడం అనేది…” అమరావతిలో రాజధాని నిర్మించడం ఇష్టం లేని జగన్ కోరికగా అభివర్ణించారు. అంతేకాదు, మీడియాకు కావలసినంత స్వేఛ్చ ఉంది, ఎక్కడ కుంగిందో చూపించాలని… వాస్తవానికి ఎక్కడ ఏమీ జరగలేదు… జగన్ కోరికను ఆయన మీడియా హైలైట్ చేసుకుంది… అంతే..! అంటూ సమాధానం చెప్పారు.
ఇక, స్థానికంగా నివసిస్తున్న వారు కూడా ఈ వార్తల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో వచ్చిన తర్వాతే ఈ విషయం తెలుసుకున్నామని, ఇందులో ఎంత నిజం ఉందో తమకు తెలియదని అంటున్నారు. బహుశా జగన్ మీడియాకు మాత్రమే కనిపించే విధంగా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో నేల కుంగిందేమో… అన్న సెటైర్లు పడుతున్నాయి. సంచలనమైన ఈ విషయం జగన్ మీడియాకు అదేదో సామెత… ‘కోతి… కొబ్బరిచిప్ప…’ మాదిరి మారిపోయిందని… ఒకవేళ నిజంగా నేల మూడు అడుగులు కుంగితే… జగన్ మీడియా ఏకంగా పాతాళంలోకి నెట్టేయడానికి ప్రయత్నాలు చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



