జూన్ 23వ తేదీన రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ “ట్యూబ్ లైట్” చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత దశాబ్ద కాలంగా వరుస పెట్టి హిట్స్ అందుకుంటున్న సల్మాన్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం కేవలం 100 కోట్లను మాత్రమే దాటగలిగింది. దీంతో భారీ లాభాలు వస్తాయని పెట్టుబడులు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టం పూడ్చాలంటూ సల్మాన్ కు విజ్ఞప్తులు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ స్థాయిలో నష్టం వస్తుందని ఊహించని సల్మాన్, వారి అభ్యర్ధనలను పరిశీలనలోకి తీసుకుని దాదాపుగా 55 కోట్ల మేర తిరిగి చెల్లించబోతున్నాడని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు కేవలం 114 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా కలెక్షన్లు దాదాపుగా క్లోజింగ్ దశకు చేరుకున్నాయి. దీంతో తప్పని పరిస్థితులలో డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను పూడ్చడానికి నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామంగా కీర్తిస్తున్నారు.
మరో పక్కన సల్మాన్ “టైగర్ జిందా హై” సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. గతంలో సల్మాన్, కత్రీనా కైఫ్ జంటగా వచ్చి సూపర్ హిట్టైన “ఏక్ థా టైగర్” సినిమాకు సీక్వెల్ గా ఇది రూపొందుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించడంతో, ఈ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సారి ఎలాంటి పండగ సీజన్లు చూసుకోకుండా తన సినిమాలను విడుదల చేయడానికే సల్మాన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.



