జయలలిత అక్రమాస్తుల కేసులో రెండవ నిందితురాలిగా ఉన్న శశికళ కేసుపై మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్నట్లు సమాచారం. కాగా, 66 కోట్ల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో జయలలిత మొదటి ముద్దాయి కాగా, రెండో ముద్దాయిగా శశికళ ఉన్నారు. చెన్నై, బెంగళూరులో ఈ కేసు 18 సంవత్సరాల పాటు నడిచింది.
2014లో ఈ కేసుపై బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పునిస్తూ, జయలలితకు 100 కోట్లు జరిమానా, పదేళ్ల జైలు శిక్ష, శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు ఒక్కొక్కరికి 10 కోట్లు జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించింది. కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించిన జయలలిత, ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి, బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేయడంతో వారు నిర్దోషులుగా బయటపడ్డారు.
అయితే ఈ తీర్పును సవాల్ చేసిన కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది, డీఎంకే పార్టీలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై మంగళవారం నాడు సుప్రీం తీర్పు వెలువరించనుంది. అయితే, ఈ కేసు తీర్పు వెలువడక ముందే జయలలిత మృతి చెందడంతో, ఆ కేసు నుంచి ఆమె పేరును తొలగించాలని సుప్రీంకోర్టును కర్ణాటక ప్రభుత్వం ఇటీవల కోరింది. దీంతో సిఎంగా ప్రమాణం చేయాలని ఊవ్విళ్ళూరుతున్న శశికళ టెన్షన్ టెన్షన్ గా ఉన్నట్లు సమాచారం.



