ముఖ్యమంత్రి జగన్ రూపొందించిన గడప – గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం వైసీపీ నేతలకు పులి మీద స్వారీ మాదిరి తయారయ్యింది. తిరగపోతే అధినేత ఊరుకోరు తిరిగితే ప్రజలు వదిలిపెట్టరు అన్న చందంగా మారింది వైసీపీ నేతల పరిస్థితి.
ప్రతిపక్ష పార్టీ నేతలను తిట్టడానికే వైసీపీ నేతలకు పదవులు ఇచ్చారా? అన్నట్టు కొందరు వైసీపీ మంత్రుల వ్యవహార శైలి ఉంటుంది. అందులో అంబటి రాంబాబు స్టయిలే వేరప్పా. ఈయనగారు అటు రాజకీయ విమర్శలే కాదు ఇటు సినిమా రివ్యూలలో కూడా సిద్దహస్తుడనే చెప్పాలి.
విషయానికి వస్తే..,గుంటూరు జిల్లా సత్తెనపల్లె నియోజకవర్గంలో అబ్బూరు గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వంలో పాల్గొన్న మంత్రి అంబటికి గ్రామ ప్రజలు తమ ప్రభుత్వ పాలనా రివ్యూ ఇచ్చినట్టున్నారు ఆవేశంతో వెనుతిరిగారు. తమ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు ఏమి అమలుకావడం లేదని, సమస్యలను మీదాకా రానివ్వకుండా మీ అనుచరులు మమ్మల్ని కట్టడి చేస్తున్నారని, ఇళ్లమీదకు దాడికి వస్తున్నారని మహిళలు అంబటిని అడ్డుకున్నారు.
గ్రామంలో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి వివరించాలి అనుకున్నా ఎంపిటిసి అలేఖ్యను ఆమె భర్త కృపారావు ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు ప్రజలు ఎదురుతిరుగుతారని ఉహించలేదో లేక అందరిని నిర్బంధిస్తే కార్యక్రమం ముందుకు సాగదని భావించారో కానీ చివరికి మంత్రిగారికి నిరసన సెగ తప్పలేదు.
ఒక్క అంబటి విషయంలోనే కాదు గడప గడపకి కార్యక్రమంలో దాదాపు వైసీపీ నేతలందిరిది ఇదే పరిస్థితి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న సామెతే ఈ కార్యక్రమానికి చక్కని ఉదాహరణ అవుతుంది. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలున్నాయి సరిచూసుకోండి అంటూ ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలకు మీడియా ముందుకు వచ్చి తన వాగ్దాటిని ప్రదర్శించే సదరు మంత్రిగారు ఇప్పుడు సైలెంట్ గా జారుకున్నారు.
ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పుడు తన నోటికి పని చెపితే ఓటర్లు తమ ఓటుకి పనిచెపుతారని భావించారో ఏమో కానీ మంత్రిగారు జేబులో రెండు చేతులు పెట్టుకోకుండానే వెనుతిరిగారు.



