సత్తెనపల్లిలో సంబరాల రాంబాబు డ్యాన్సులు ఇక చూడలేమా?అంటే అవుననే అంటున్నారు వైసీపీలోని విజయభాస్కర్ రెడ్డి వర్గం. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ అయిన చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఆదివారం సత్తెనపల్లి పట్టణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన తన అనుచరులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ,”గత ఎన్నికలు వైసీపీకి చాలా కెలకమైనవి కనుక నేను సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలనుకొనప్పటికీ అధిష్టానం సూచన మేరకు వెనక్కు తగ్గి పార్టీ అభ్యర్ధి (అంబటి రాంబాబు)కి మద్దతు ఇచ్చాను. కానీ ఆయన వ్యవహార శైలితో నియోజకవర్గంలో పార్టీకి చాలా నష్టం జరుగుతోంది. అప్పుడప్పుడు తన కార్యాలయంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ, పది మంది పోలీసులను వెంటబెట్టుకొని నియోజకవర్గంలో రోడ్లపై తిరుగుతూ హడావుడి చేస్తుంటారు. ఆయనకి ఎప్పుడూ ప్రచారార్భాటమే తప్ప గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకొందామనుకోరు. కానీ నేను తరచూ గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలని అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటాను. ఆయన (అంబటి రాంబాబు) పోలీసులు లేకుండా గ్రామాలలో పర్యటించగలరా?పర్యటిస్తే ప్రజలు ఛీకొడతారని ఆయనకీ తెలుసు.
ఆయన తీరుపట్ల నియోజకవర్గంలో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. నియోజకవర్గంలో మా వైసీపీ నేతలు, కార్యకర్తలు చిన్న చిన్న పనుల కోసం మంత్రి దగ్గరకు వెళ్ళిన్నా పట్టించుకోరు. అవమానించి పంపించేస్తుంటారు. ఇది పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదు. ప్రజలకు జగనన్న మీద అభిమానం ఉన్నా ఇలాంటివారి వలన పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది.
ఇదే విషయం నేను సిఎం జగన్ని కలిసి వివరించి వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని అడగబోతున్నాను. ఈసారి ఎన్నికలలో తగ్గేదేలే… సత్తెనపల్లి నుంచి తప్పకుండా నేనే పోటీ చేస్తాను. నియోజకవర్గంలో స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు అందరూ నాకు మద్దతు ఇస్తే, నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను కనుక ఎటువంటి సమస్యలనైనా మనమే పరిష్కరించుకోవచ్చు,” అని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి సత్తెనపల్లి పట్టణంతో పాటు నాలుగు మండలాలలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యి విజయభాస్కర్ రెడ్డికి మద్దతు తెలిపారు.



