ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా జైలు నుంచి బయటకు వచ్చిన సత్యంబాబు కేసు గురించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రంగనాథ్ సమగ్రంగా వివరించారు. నందిగామలో చిన్న చిన్న హాస్టల్స్ చాలా ఉన్నాయని, అక్కడి హాస్టళ్లలో చిన్న చిన్న వస్తువులు పోవడం, మహిళల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందని తెలిపారు. ఆయేషా మీరా హత్య జరిగిన అనంతరం ఇలాంటి చిన్న నేరాలు జరగడం ఆగిపోయిందని చెప్పారు. 2008 జనవరి నుంచి జూలై వరకు అలాంటి చిన్న చిన్న ఘటనలు ఏవీ చోటు చేసుకోలేదని అన్నారు.
దీంతో తాము ఇలాంటి నేరాలు ఎవరు చేస్తారా? అని దర్యాప్తు చేస్తే… సత్యంబాబేనని తేలిందని, అతని ఫోటోను పలువురికి చూపించగా వారు కూడా అతనే దోషి అని గుర్తు పట్టారని తెలిపారు. అలాగే తాము కేసును రీ కన్ స్ట్రక్షన్ చేసిన సమయంలో కూడా… అయేషా మీరాపై చేసిన దారుణాన్ని సత్యంబాబు కళ్లకు కట్టినట్టుగా వివరించాడని అన్నారు. అంతే కాకుండా, అయేషా మీరా బాడీ దగ్గర దొరికిన రక్తం నమూనాతో, సత్యంబాబు డీఎన్ఏ సరిపోలిందని చెప్పారు.
ఇవన్నీ చూసిన తరువాతే తాము ఆయేషా మీరా కేసులో సత్యంబాబు దోషిగా చెప్పామని, హైకోర్టు తీర్పుతోనే నిజం తేలిపోలేదని, సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు. ఏవో టెక్నికల్ గ్రౌండ్స్ చూపించి హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చి ఉంటుందని, అంతే తప్ప పోలీసులు ఎప్పుడూ తప్పు చేయరని, కొన్ని వేల కేసులు డీల్ చేసే పోలీసులు, ఒకట్రెండు కేసుల్లో చిన్న చిన్న తప్పులు చేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ కేసు నిజంగానే సుప్రీంకు వెళితే, మరో ట్విస్ట్ వెలుగుచూస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



