ఖాతాల్లో కనీస నిల్వలు లేకుంటే ఎటువంటి మొహమాటం లేకుండా పెనాల్టీ చార్జీలు విధిస్తామని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మరోసారి స్పష్టం చేశారు. అయితే జన్ ధన్ ఖాతాలకు మాత్రం ఇది వర్తించదని, నిజానికి మొత్తంగా ఉన్న 11 కోట్ల జన్ ధన్ ఖాతాల నిర్వహణ భారంగా మారడంతోనే కనీస నిల్వ ఆంక్షలు విధించామని, కనీస నిల్వ లేకుంటే జరిమానా చెల్లించక తప్పదని అన్నారు.
ఏప్రిల్ 1 నుంచి జరిమానా విధించే పాత పద్ధతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చేందుకు ఎస్బీఐ ప్రయత్నిస్తుండడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై మరోసారి ఆలోచించాలంటూ చేసిన ప్రభుత్వ సూచనపై తమకు సమాచారం లేదని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రజనీశ్ కుమార్ తెలపగా, ప్రభుత్వం కోరితే కనుక దీనిని పునరాలోచిస్తామని పేర్కొన్నారు. అలాగే ఏటీఎంల వినియోగంపై స్పష్టత ఇచ్చారు అరుంధతీ.
సాధారణంగా నెలకు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను వినియోగించాల్సిన అవసరం రాదని, ఖాతాదారులు తమ లావాదేవీల కోసం తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందేనని, ఈ విషయంలో మొబైల్, ఇంటర్నెట్ వంటి అధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఓ గృహస్తుడికి నెలకు నాలుగు సార్ల కంటే ఎక్కువగా ఏటీఎంను ఉపయగించాల్సినంత అవసరం ఏముంటుందని, ఇటువంటి అవసరం వ్యాపారులకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.



