‘జై లవకుశ’ టీజర్లోని ‘జై’ పాత్ర తాను రాసుకున్నట్లుగా ఉంది అంటూ దర్శకుడు పూరీ జగన్నాధ్ ‘పైసా వసూల్’ సినిమా సెట్స్ లో తన ఆవేదన వెలిబుచ్చినట్లుగా వచ్చిన వార్తలను, తాజాగా ‘జై లవకుశ’ టీం ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండింటి నడుమ ఓ కీలక ఘట్టం చోటు చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. జగన్ – జూనియర్ ల మధ్య ఓ చర్చ జరిగిందని, దీని తర్వాతే ‘జై లవకుశ’ టీం నుండి ఖండించే వార్త బయటకు వచ్చిందని తెలుస్తోంది.
ఇంతకీ ఈ చర్చలో ఏం తేల్చారంటే… త్వరలో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా చేయడం… అలాగే ఇక పై ‘జై లవకుశ’ సినిమాపై పూరీ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. ఈ దిశగా సాగిన చర్చలు సఫలం అయ్యాయని, త్వరలోనే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ – పూరీల కాంభినేషన్ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న తారక్, తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేసే అవకాశం కనపడుతోంది.
జక్కన్న సినిమాను బట్టే జూనియర్ ఎన్టీఆర్ ఎవరితో సినిమాలు చేయాలి అన్నది ఆధారపడి ఉంది. ‘జై లవకుశ’ పూర్తయిన అనంతరం జక్కన్న సినిమాకు కాస్త విరామం దొరికితే పూరీ చిత్రాన్ని చేయవచ్చని, అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం లభిస్తే… త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను గానీ చేయాలని తారక్ భావిస్తున్నారట. ఒకవేళ జక్కన్న రెడీ అయితే మరో అవకాశం ఏ దర్శకుడికి లేకుండా ఈ సినిమానే చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.



