హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సభ్యుల మధ్య “ఫిదా” ఆడియో వేడుక అట్టహాసంగా జరిగింది. ఎలాంటి ప్రత్యేక అతిథి లేకుండా జరిగిన ఈ సినీ వేడుకలో దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన సుదీర్ఘమైన ప్రసంగం వీక్షకుల సహనాన్ని పరీక్షించిందని చెప్పాలి. ‘తక్కువ మాట్లాడడం – ఎక్కువ పని చేయడం’ అనేది శేఖర్ కమ్ముల సహజ నైజం. కానీ దానికి విరుద్ధంగా ‘ఫిదా’ ఆడియో వేడుకలో చాలా సేపు ప్రసంగించారు. అది కూడా ఆకట్టుకునే రీతిలో కాకపోవడం అసలు విషయం.
తనకు రాని విద్యను ప్రదర్శించడానికి శేఖర్ కమ్ముల ప్రయత్నించినట్లుగా కనపడింది. బహుశా ‘ఫిదా’ కోసం ఒక ఏడాది పాటు బాగా కష్టపడ్డారో ఏమో గానీ, ఆ కష్టాన్ని అంతా ప్రేక్షకులకు చెప్పుకోవడానికి మాత్రం ఇంకా కష్టపడ్డారని చెప్పాలి. శేఖర్ ప్రసంగంలోని అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఆడియో ఫంక్షన్ లో సంగీత దర్శకుడు పేరు తప్ప అందరి పేర్లను ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించడం. అయితే హీరోయిన్ సాయిపల్లవి గుర్తు చేయడంతో సంగీత దర్శకుడు శశికాంత్ గురించి కూడా ప్రస్తావించారు.
మెగా ఫ్యాన్స్ కు ఊరట చెందిన విషయం ఏమిటంటే… మధ్యలో ఓ రెండు, మూడు సార్లు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం, అలాగే ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి హీరో పవన్ కు వీరాభిమాని అని చెప్పడంతో కాస్త కేరింతలు వినిపించాయి. అయితే వాటిని ఆపడానికి కూడా శేఖర్ తిప్పలు పడ్డారనుకోండి. ఇంతలా అరుస్తారని తెలియదు… నాకు కొత్త, లేకపోతే చెప్పేవాడ్ని కాదు అన్న భావనలో శేఖర్ ఓ డైలాగ్ వేసారు. ఈ వేడుక ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే… బహిరంగ వేదికలపై మాట్లాడాలంటే శేఖర్ కమ్ములకు చాలా కష్టం అని..!



