ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు నేడు మీడియాతో మాట్లాడుతూ, “ఇలాంటి అన్న ఉంటే వేరే శత్రువులు అవసరం లేదు. అన్న అనే పదానికే జగన్మోహన్ రెడ్డిగారు కళంకం తెచ్చారు,” అంటూ అన్నని ఆక్షేపించారు.
ఆమె అన్నపై తరచూ విమర్శలు చేస్తూనే ఉంటారు. కానీ ఈ మాటలు ఆమె మనసులో నుంచి వచ్చినవని అర్దమవుతూనే ఉంది.
వివేకా హత్య కేసులో కూడా ఆమె మరోసారి అన్ననే వేలెత్తి చూపారు. “నాడు బాబాయ్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని మొట్ట మొదట చెప్పింది మీ సాక్షి అంటే జగన్మోహన్ రెడ్డిగారు. ఆ తర్వాత గుండెపోటు కాదు హత్య అని చెప్పింది మీరే.
ఆ హత్యని టీడీపితో ముడిపెట్టింది మీరే. ఆ తర్వాత సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కలిసి హత్య చేశారని చెప్పింది మీరే.
ఆ హత్యపై సీబీఐ విచారణ కోరింది మీరే. సీబీఐ విచారణని అడుగడుగునా అడ్డుకున్నదీ మీరే… అన్నీ మీరే చేసి వాటిని ఇతరులకి ఆపాదించి ఆరోపణలు చేస్తున్నారు,” అంటూ వివేకా హత్య కేసుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా అక్కలు, చెల్లెమ్మలు అంటూ దీర్గాలు తీసే జగన్మోహన్ రెడ్డి గురించి సొంత చెల్లే ఈవిధంగా అంటున్నారంటే ఆయనలో ఓ అపరిచితుడు ఉన్నారనుకోవచ్చు.
ఆస్తుల విషయంలో అన్నతో కోర్టులో పోరాడవలసి వస్తోంది కనుక ఆ కోపంతో షర్మిల ఈవిధంగా అన్న గురించి తప్పుగా మాట్లాడుతున్నారనుకున్నా విజయమ్మ తాజా స్టేట్మెంట్ కూడా జగన్ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని సూచిస్తోంది కదా?
గిఫ్ట్ డీడ్ వెనక్కు తీసుకునే కేసులో “తాను కూతురు షర్మిలకి బినామీని కాదు,” అని కోర్టుకి చెప్పుకోవలసి రావడం విజయమ్మకు అవమానమే కదా?
ఓ పక్క బందుత్వమే లేని సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గురుశిష్యుల్లా కలిసి మెలిసి పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అన్నదమ్ములా కలిసి మెలిసి పనిచేస్తున్నారు.
బంధువులైన చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నారా లోకేష్ కుటుంబ సభ్యులు అరమరికలు లేకుండా కలుస్తున్నారు. అందరూ కలిసి ఫోటోలు దిగుతున్నారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.
వీరితో పోలిస్తే జగన్ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏవిధంగా ఉంది? ఎందుకు ఇలా ఉంది? అని సామాన్య ప్రజలకు కూడా ఆలోచన కలుగకుండా ఉంటుందా?






