సూపర్ స్టార్ అల్లుడు, ప్రముఖ తమిళ హీరో అయిన ధనుష్ పై గాయని సుచిత్రా కార్తీక్ ఇటీవల చేసిన ట్వీట్లు దుమారం రేపడంతో, తాజాగా ఆమె భర్త కార్తీక్ రంగంలోకి దిగారు. ఆ ట్వీట్లు సుచిత్ర చేసినవి కావంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో వివరణ ఇచ్చారు. సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఆ సమయంలోనే ట్వీట్లు పోస్టయ్యాయని పేర్కొన్నారు.
“ఇన్ని రోజులుగా పబ్లిష్ అవుతున్న ట్వీట్లు సుచి చేసినవి కావు. సుచి అకౌంట్ హ్యాక్ అవడంతో మేం చాలా కలత చెందాం. ఈ రోజు సుచి అకౌంట్ను రిట్రైవ్ చేశాం” అని కార్తీక్ పేర్కొన్నారు. ఇటువంటి సందర్భాల్లో అవతలి వ్యక్తులు ఎంతటి ఒత్తిడికి గురై ఉంటారో తాను అర్థం చేసుకోగలనని, వారందరినీ క్షమాపణ వేడుకుంటున్నట్టు చెప్పారు. ఇటువంటి విషయాల్లో మీడియా కూడా సంయమనం పాటించాలని కోరారు.
అయితే భర్త కార్తీక్ వివరణను సుచిత్ర ధృవీకరించకపోవడం కొసమెరుపు. అలాగే ట్విట్టర్ ఎకౌంటు హ్యాక్ అయితే చేతిపై వాతలు ఉన్న సుచిత్ర ఫోటోలు ఏ విధంగా పోస్ట్ అయ్యాయో అర్ధం కాని పరిస్థితి. ధనుష్ పై వివాదానికి హ్యాకింగ్ అద్దుతున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, ధనుష్, ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ పై కొన్ని రోజులుగా సుచిత్ర సంచలన ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.



