మరికొద్ది గంటల్లో కేంద్రం ఏపీకి ప్యాకేజ్ ప్రకటించనున్న నేపధ్యంలో… దానికి సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతున్నాయి. ముఖ్యంగా ప్యాకేజ్ హైలైట్స్ అంటూ… అందులో ఉన్న అంశాలను క్లుప్తంగా మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. అయితే వీటిని ఆధారంగా చేసుకుని ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అధ్యక్షుడు శివాజీ బిజెపిపై ఓ రేంజ్ లో మండిపడ్డారు.
ఏపీకి కేంద్రం ఇవ్వనున్న ‘ప్రత్యేక ప్యాకేజ్’ పిండాకూడులా ఉందని, విశాఖ రైల్వే జోన్ తో లాభాలు వస్తాయని, అదే విజయవాడలో జోన్ ఏర్పాటు చేస్తే గొడవలు ఉత్పన్నమవుతాయని, రాజధానికిచ్చే రూ.2,500 కోట్లు రోడ్లకు కూడా సరిపోవని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే… బ్యాంకు లోన్లిస్తామనడం చిప్ప చేతికివ్వడమేనని తీవ్ర పదజాలాన్ని వినియోగించారు. కేంద్రం వైఖరికి సరేనంటే భారీ నష్టం తప్పదంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కూడా హెచ్చరించారు.
అయితే కేంద్రం అధికారికంగా ఏమీ చెప్పకుండానే, మీడియా వార్తలను ఆధారం చేసుకుని విమర్శలు చేయడం తగదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రం ప్రకటన తర్వాత ఖచ్చితంగా శివాజీ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పవచ్చు. బహుశా ఇవే విమర్శలు ప్రకటన తర్వాత చేసినట్లయితే మరింత ప్రాధాన్యతను కూడా దక్కించుకునేవి. ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అన్న చందంగా శివాజీ విమర్శలు ఉన్నాయని పొలిటికల్ వర్గాల టాక్.



